ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌.. వడ్డీ రేట్లు పెంచేందుకు ఆర్‌బీఐ రెడీ?

ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌.. వడ్డీ రేట్లు పెంచేందుకు ఆర్‌బీఐ రెడీ?

RBI ready to hike interest rates due to inflation effect
  • ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు ప్రారంభించే అవకాశం ఉందని నివేదిక
  • అక్టోబర్‌ ఎంపీసీ భేటీలో తొలి సంకేతాలు రావొచ్చని అంచనా
  • ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో 6.5 శాతానికి చేరొచ్చని నివేదిక
  • 4.82 శాతానికి పెరిగిన ఆగస్టు రిటైల్‌ ద్రవ్యోల్బణం
  • 5.95 శాతానికి చేరిన ఆహార ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఆర్‌బీఐ) వడ్డీ రేట్ల పెంపు సైకిల్‌ను ప్రారంభించే అవకాశం ఉందని సిస్టమాటిక్స్‌ గ్రూప్‌ నివేదిక పేర్కొంది. అక్టోబర్‌ తొలి వారంలో జరిగే ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఇందుకు సంబంధించిన తొలి సంకేతాలు కనిపించొచ్చని తెలిపింది. ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటు క్రమంగా 6.5 శాతానికి చేరే అవకాశముందని అంచనా వేసింది.

ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి పెరిగింది. జులైలో ఇది 4.45 శాతంగా ఉంది. కొత్త సిరీస్‌లో ఇదే అత్యధిక స్థాయి. వరుసగా మూడో నెలలోనూ ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్న 4 శాతం మధ్యస్థ స్థాయిని దాటింది.

ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.95 శాతానికి చేరింది. జులైలో ఇది 5.52 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. అక్కడ ఆహార ద్రవ్యోల్బణం 6.13 శాతంగా ఉంది.

హోల్‌సేల్‌ ధరల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 9.92 శాతానికి పెరిగింది. జులైలో ఇది 9.78 శాతంగా ఉంది. కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ధరలు ప్రధాన ఒత్తిడిగా మారాయని నివేదిక తెలిపింది. ఇంధనం, ఇంధన ఆధారిత ఉత్పత్తుల ధరలు, తయారీ వ్యయాలు కూడా ధరల పెరుగుదలను విస్తృతం చేస్తున్నాయని పేర్కొంది.

ద్రవ్యోల్బణం ఇదే వేగంతో కొనసాగితే అక్టోబర్‌-నవంబర్‌ నాటికి ఆరు శాతాన్ని దాటొచ్చని అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావంతో ఆహార సరఫరాపై ఒత్తిడి, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి మరింత ముప్పుగా మారొచ్చని తెలిపింది.
Advertisement
RBI
Repo Rate Hike
Inflation in India
Monetary Policy Committee
Retail Inflation CPI
Systematix Group Report

More Telugu News