కిలో బియ్యానికి 2 వేల లీటర్ల నీరు.. వరి సాగులో నీటి వృథాకు ఐఐటీ మద్రాస్‌ సరికొత్త ఆలోచన

కిలో బియ్యానికి 2 వేల లీటర్ల నీరు.. వరి సాగులో నీటి వృథాకు ఐఐటీ మద్రాస్‌ సరికొత్త ఆలోచన

IIT Madras new idea to prevent water waste in rice cultivation
  • వరి సాగులో నీటి వినియోగం తగ్గించేందుకు ఐఐటీ మద్రాస్‌ కృషి
  • ప్రెసిషన్‌ అగ్రికల్చర్‌పై ఐఐటీ మద్రాస్‌ దృష్టి
  • ప్రస్తుతం కిలో వరికి 1,500-2,000 లీటర్ల నీరు అవసరమవుతున్నట్లు వెల్లడి
  • పంజాబ్‌, హరియాణాలో 2,672 లీటర్ల వరకు వినియోగం
  • సెన్సర్లతో నేలలో తేమను గుర్తించే అవకాశం
వరి సాగుకు భారీగా నీరు అవసరం. దేశంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలే దీనికి ప్రధాన ఆధారం. నీటి కొరత పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో వరిని పండించే మార్గాలపై ఐఐటీ మద్రాస్‌ దృష్టి పెట్టింది.

ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి ఈ విషయాన్ని వెల్లడించారు. తక్కువ నీటితో వరి, చెరకు వంటి పంటలను పండించేందుకు ‘ప్రెసిషన్‌ అగ్రికల్చర్‌’పై పని చేస్తున్నట్టు ‘ఇండియా టుడే’తో తెలిపారు.

భారత్‌లో కిలో వరి పండించేందుకు సగటున 1,500 నుంచి 2,000 లీటర్ల నీరు అవసరమవుతున్నట్టు ఓ అధ్యయనం తెలిపింది. పంజాబ్‌, హరియాణాలో భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఈ వినియోగం 2,270 నుంచి 2,672 లీటర్ల వరకు ఉంటోంది.

నీటిని అవసరమైనంత మాత్రమే అందించేందుకు పొలాల్లో సెన్సర్లను ఏర్పాటు చేయొచ్చు. ఇవి నేలలో తేమను గుర్తిస్తాయి. పంటకు నీరు ఎప్పుడు అవసరమో రైతుకు తెలియజేస్తాయి. డ్రిప్‌ ఇరిగేషన్‌తో నీటిని నేరుగా మొక్కల వేర్లకు అందించొచ్చు.

ఉపగ్రహాలు, డ్రోన్ల సాయంతో పొలంలో పంట పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. ఎక్కడ నీరు అవసరమో అక్కడే అందించే అవకాశం ఉంటుంది.

వరి సాగులో ‘ఆల్టర్నేట్‌ వెట్టింగ్‌ అండ్‌ డ్రైయింగ్‌’ పద్ధతితోనూ నీటిని ఆదా చేయొచ్చు. ఇందులో పొలాన్ని ఎప్పుడూ నీటితో నింపి ఉంచరు. కొంతకాలం నేలను ఆరనిచ్చి, అవసరమైనప్పుడు మళ్లీ నీరు పెడతారు. దీనివల్ల దిగుబడిపై పెద్దగా ప్రభావం లేకుండానే నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వ్యవసాయం భారత్‌లో భారీగా నీటిని వినియోగిస్తోంది. భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. వాతావరణ మార్పులతో పరిస్థితి మరింత కఠినంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది.
Advertisement
IIT Madras
Precision Agriculture
Rice Cultivation
Water Conservation
Professor V Kamakoti
Sustainable Farming

More Telugu News