కొండా ఫ్యామిలీ ఒత్తిడి వ్యూహం.. బెడిసికొట్టిందా?

Konda Surekha pressure strategy backfires in Telangana Congress
  • ఢిల్లీ వేదికగా రేవంత్‌పై కొండా సురేఖ ఎదురుదాడి
  • తన కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదని స్పష్టీకరణ
  • అదే రోజు రాజగోపాల్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు
  • కొండా ఫ్యామిలీ ఒత్తిడి వ్యూహం బెడిసికొట్టిందన్న చర్చ
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగిన పరిణామాలతో ఈ వివాదం పతాక స్థాయికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినా తనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపడమే తప్పని కొండా సురేఖ మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం.

పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా అంటారని ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది. అంతేకాకుండా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలపై వచ్చిన కమీషన్ల ఆరోపణల సంగతేంటని నిలదీసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి వస్తే తాను పార్టీకి భిన్నమైన వైఖరి తీసుకుంటాననే సంకేతాలు పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒత్తిడి వ్యూహమా లేక కొండా కుటుంబం వద్ద 'ప్లాన్ బి' ఏదైనా ఉందా అనే కోణంలో పార్టీలో చర్చ మొదలైంది.

ఇదే సమయంలో, వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బయటి నుంచి వచ్చిన వారు పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని, తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ పాలన తెస్తామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అటు ఢిల్లీలో సురేఖ, ఇటు తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి ఒకేసారి కీలక వ్యాఖ్యలు చేయడం కాకతాళీయమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి, సీఎంపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సురేఖ మొదట్లోనే ఖండించి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. భర్తకు ఎమ్మెల్సీ పదవి కోసం మొదలుపెట్టిన ఒత్తిడి వ్యూహం, చివరికి సురేఖ మంత్రి పదవికే ఎసరు తెచ్చిందా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
Advertisement
Konda Surekha
Telangana Congress
Revanth Reddy
Komatireddy Rajgopal Reddy
Telangana Politics
Congress Internal Rift

More Telugu News