Advertisement

డీప్‌ఫేక్ వీడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన 'అర్జున్ రెడ్డి' హీరోయిన్

Shalini Pandey reacts strongly to viral deepfake video
  • తనపై వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన నటి షాలినీ పాండే
  • ఆ వీడియో పూర్తిగా కల్పితమని, తనది కాదని వెల్లడి
  • వీడియోను షేర్ చేయకుండా వెంటనే రిపోర్ట్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి
  • టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడంపై తీవ్ర ఆవేదన
  • ఇప్పటికే పలువురు భారతీయ నటీనటులు డీప్‌ఫేక్‌ల బారిన పడిన వైనం
'అర్జున్ రెడ్డి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి షాలినీ పాండే, తనపై ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా కల్పితమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియో అని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

"ఆన్‌లైన్‌లో ప్రచారమవుతున్న ఆ వీడియో పూర్తిగా అవాస్తవం. అందులో ఉన్నది నేను కాదు" అని షాలినీ స్పష్టం చేశారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదని, ఇది ఒక రకమైన వేధింపేనని ఆమె పేర్కొన్నరు.

ఈ సందర్భంగా ఆమె ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ఆ నకిలీ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని, ఇతరులకు పంపవద్దని, అలాగే డౌన్‌లోడ్ చేయవద్దని కోరారు. దానికి బదులుగా, ఆ వీడియోను వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, ఇలాంటి కల్పిత వీడియోల వ్యాప్తిని అరికట్టడంలో సహకరించాలని కోరారు.

ఇటీవల కాలంలో డీప్‌ఫేక్ వీడియోల బారిన పడుతున్న ప్రముఖుల జాబితాలో షాలినీ పాండే కూడా చేరారు. గతంలో రష్మిక మందన్న, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, అలియా భట్, ఆమిర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ వంటి పలువురు సినీ తారలు ఇలాంటి నకిలీ వీడియోల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. షాలినీ పాండే 'అర్జున్ రెడ్డి'తో పాటు 'మహానటి', 'జయేష్‌భాయ్ జోర్దార్', 'మహారాజ్' వంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు.
Advertisement
Shalini Pandey
Arjun Reddy actress deepfake
Shalini Pandey viral video
Deepfake technology
Shalini Pandey Instagram

More Telugu News