Advertisement

నేపాల్‌ విపత్తుపై సద్గురు కీలక ప్రతిపాదన.. రూ.కోటి విరాళం

Sadhguru proposes key board for Nepal disaster and donates 1 crore
  • 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటు చేయాలన్న సద్గురు
  • నేపాల్‌ సహాయ నిధికి రూ.కోటి విరాళం ప్రకటన
  • వరదల్లో వేలాది మంది గల్లంతైనట్లు వెల్లడి
  • ఇషా యాత్రకు చెందిన 77 మందికి సంబంధించి లేని ఆచూకీ
  • గల్లంతైన ముగ్గురు ఇషా వాలంటీర్లు
హిమాలయ ప్రాంతంలో విపత్తులను ఎదుర్కొనేందుకు భారత్‌, చైనా, పాకిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌తో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ప్రతిపాదించారు. రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఈ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నేపాల్‌ వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఖాట్మండులో ఆదివారం జరిగిన ‘ఇన్‌ సాలిడారిటీ విత్‌ నేపాల్‌’ కార్యక్రమంలో సద్గురు మాట్లాడారు. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో ఇటీవల సంభవించిన భారీ వరదలతో వేలాది మంది గల్లంతయ్యారని తెలిపారు. మృతుల సంఖ్య కూడా భారీగా ఉండే అవకాశం ఉందన్నారు. విపత్తు సమయంలో చైనా వైపు గ్యిరోంగ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్న ఇషా సంస్థకు చెందిన కైలాశ్‌ యాత్రలో పాల్గొన్న 77 మంది ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పారు. నేపాల్‌ వైపు ఉన్న ముగ్గురు ఇషా వాలంటీర్లు కూడా గల్లంతైనట్లు తెలిపారు.

హిమాలయ పర్వతాలకు దేశాల సరిహద్దులు తెలియవని సద్గురు అన్నారు. పర్వత ప్రాంతాలను ఒకే పర్యావరణ వ్యవస్థగా భావించి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపాదిత హిమాలయ బోర్డును ఆలస్యం చేయకుండా ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నా.. హిమాలయాల పరిరక్షణ విషయంలో దేశాల మధ్య సమన్వయం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఇలాంటి విపత్తును నేపాల్‌ ఒక్కటే ఎదుర్కోవడం సాధ్యం కాదని సద్గురు అన్నారు. తక్షణ సహాయంతో పాటు భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని చెప్పారు. ప్రకృతి విపత్తులకు ఆధ్యాత్మిక లేదా మతపరమైన కారణాలు ఆపాదించొద్దని సూచించారు. భౌతిక ఘటనలకు భౌతిక కారణాలే ఉంటాయని, బాధితుల కష్టాలను తాత్విక వ్యాఖ్యలతో తక్కువ చేసి చూడకూడదని అన్నారు.

జీవితం ఎంత సున్నితమైనదో విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే గుర్తించకూడదని సద్గురు చెప్పారు. ప్రతి క్షణం మనిషి తన జీవితానికి పరిమితి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వరదల్లో మరణించిన వారి కోసం కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో నిర్వహించే ‘కాల భైరవ కర్మ’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు.
Advertisement
Sadhguru
Nepal Floods
Isha Foundation Donation
Himalayan Disaster Management Board
Sadhguru Nepal Relief
Nepal Natural Disasters

More Telugu News