సెప్టెంబర్ 1 నుంచి విమానాశ్రయాల్లో కొత్త రూల్.. ఇకపై అంతా డిజిటల్!

New rule in airports from September 1 Everything digital now
  • ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద ఫిజికల్ బోర్డింగ్ పాస్ తప్పనిసరి కాదు
  • డిజిటల్ లేదా ఈ-బోర్డింగ్ పాస్‌తోనే క్లియరెన్స్ పొందవచ్చు
  • బోర్డింగ్ పాస్‌పై స్టాంపింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం
  • దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ మార్పులు అమలు
విదేశాలకు ప్రయాణించే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సెప్టెంబర్ 1 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద భౌతిక (ఫిజికల్) బోర్డింగ్ పాసులను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

నూతన నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ డిజిటల్ లేదా ఈ-బోర్డింగ్ పాస్‌లను చూపించి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న బోర్డింగ్ పాస్‌లపై ముద్రలు (స్టాంపింగ్) వేసే పద్ధతికి స్వస్తి పలకనున్నట్లు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ప్రకటించింది. ఒకవేళ ప్రయాణికుల వద్ద భౌతిక బోర్డింగ్ పాస్‌లు ఉన్నప్పటికీ వాటిని అనుమతిస్తారు, కానీ వాటిపై ఎలాంటి స్టాంపులు వేయరు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ మార్పు అమల్లోకి రానుందని ఢిల్లీలోని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) ఒక అంతర్గత నోట్‌లో ధృవీకరించింది. ప్రస్తుత స్టాంపింగ్ విధానం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురికావడంతో పాటు, అప్పుడప్పుడు ముద్రలు వేయడంలో పొరపాట్లు జరుగుతున్నాయని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గుర్తించింది. ఈ ఇబ్బందులను అధిగమించి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కొత్త నిబంధనపై విమానాశ్రయ యాజమాన్యాలు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అన్ని భాగస్వామ్య పక్షాలను ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
Advertisement
Bureau of Immigration
Digital Boarding Pass
International Travel Rules
Indian Airports
Immigration Process

More Telugu News