విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రతి ఎమ్మెల్యేకి కారు, డ్రైవర్, సెక్రటరీ

Vijay Government sensational decision car driver and secretary for every MLA
  • తమిళనాడులోని 234 మంది ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ భారీ కానుకలు
  • ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ కారు, డ్రైవర్, సెక్రటరీ సౌకర్యం
  • కారు నిర్వహణకు నెలకు రూ.75,000, సెక్రటరీ కోసం రూ.25,000
  • ప్రభుత్వ నిర్ణయంపై విపక్ష డీఎంకే తీవ్ర విమర్శ
  • ఇది ప్రజాధనం దుర్వినియోగమేనని డీఎంకే ఆరోపణ
తమిళనాడులో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనంతో పాటు భారీగా అలవెన్సులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేలకు ఒక కారు, దాని నిర్వహణకు అవసరమైన భత్యం, అధికారిక పనుల కోసం ఒక సెక్రటరీని నియమించుకునేందుకు గ్రాంట్‌ను అందిస్తున్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ సీఎం విజయ్ మాట్లాడారు. "ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటించాల్సి ఉంటుంది. వారికి ప్రభుత్వ వాహనం కేటాయించడం ద్వారా పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందించడానికి వీలవుతుంది" అని ఆయన వివరించారు. ప్రస్తుత అసెంబ్లీలో చాలా మంది ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికైన వారని, వారిలో కొందరు సాధారణ ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చారని, ప్రజా ప్రతినిధులుగా తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వారికి కారు అవసరమని విజయ్ పేర్కొన్నారు.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ప్రతి ఎమ్మెల్యేకి కారు డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75,000 అలవెన్సు అందనుంది. అదనంగా అధికారిక పనుల కోసం ఒక సెక్రటరీని నియమించుకునేందుకు నెలకు రూ.25,000 రాష్ట్ర గ్రాంట్‌ను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. వీసీకే పార్టీ ఎమ్మెల్యే జ్యోతిమణి.. ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

సీఎం ప్రకటనపై అధికార పక్ష ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. టీవీకే మిత్రపక్షమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారగై కత్‌బర్ట్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా దీన్ని స్వాగతిస్తారని అన్నారు. ఈ నిర్ణయం వల్ల డ్రైవర్లు, సెక్రటరీలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ అభిప్రాయపడ్డారు.

అయితే, విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది పూర్తిగా అనవసరమైన ఖర్చు అని మండిపడింది. "ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడుతుంది. 234 మంది ఎమ్మెల్యేలకు కార్లు కొనడం, అదనపు అలవెన్సులు ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అసలు దీని అవసరం ఇప్పుడు ఏముంది?" అని డీఎంకే అధికార ప్రతినిధి ఎ. శరవణన్ 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సేవకు ఈ సౌకర్యాలు తప్పనిసరని ప్రభుత్వం చెబుతుండగా, ఇది ప్రజాధనం దుర్వినియోగమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Advertisement
Joseph Vijay
Tamil Nadu Government
TVK Party
Tamil Nadu MLAs
MLA Allowances
Tamil Nadu Politics

More Telugu News