‘దిమాగీ నక్సల్స్‌’.. ఎవరో చెప్పిన కేంద్ర మంత్రి రిజిజు

Kiren Rijiju explains who are Dimagi Naxals mentioned by PM Modi
  • ‘దిమాగీ నక్సల్స్‌’పై రిజిజు వివరణ
  • మావోయిస్టులకు మద్దతుదారులు తొలి వర్గమన్న రిజిజు
  • ఆర్టికల్‌ 370 అనుకూలంగా ఉండేవారిని రెండో వర్గంగా వెల్లడి
  • ‘చికెన్‌ నెక్‌’ను వేరు చేయాలనుకునేవారు మూడో వర్గమని వివరణ
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ‘దిమాగీ నక్సల్స్‌’ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు ‘దిమాగీ నక్సల్స్‌’ అంటే ఎవరనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. ఆ పదంతో ఎవరిని ఉద్దేశిస్తున్నారో మూడు అంశాల ద్వారా వివరించారు.

మావోయిస్టులకు మద్దతు ఇస్తూ రాజ్యాంగాన్ని తిరస్కరించేవారిని ‘దిమాగీ నక్సల్స్‌’గా పరిగణించవచ్చని రిజిజు చెప్పారు. ఇక, వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చేవారు, ఆర్టికల్‌ 370కి అనుకూలంగా నిలిచేవారు రెండో వర్గంలోకి వస్తారని పేర్కొన్నారు. దేశ సమైక్యతకు ముప్పు కలిగించే ఆలోచనలను ఆయన ఈ అంశాలతో ముడిపెట్టారు.

ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వేరు చేయాలని కోరుకునేవారు మూడో వర్గమని రిజిజు అన్నారు. సిలిగురి కారిడార్‌ను ‘చికెన్‌ నెక్‌’గా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈ ఇరుకైన మార్గమే ఈశాన్య ప్రాంతాలకు దేశంలోని మిగతా ప్రాంతాలతో ప్రధాన అనుసంధానం. దీన్ని విడదీయాలని కోరుకునే వారి గురించి రిజిజు ప్రస్తావించారు.

ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని అణచివేశామని చెప్పారు. అయితే మావోయిస్టు భావజాలం మరో రూపంలో కొనసాగుతోందని హెచ్చరించారు. అధికార వ్యవస్థలోకి చొరబడిన అలాంటి భావజాలాన్ని గుర్తించి ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు.

మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం స్పందిస్తూ తాను ‘దిమాగీ నక్సల్‌’గా గర్విస్తున్నానని అన్నారు. దీంతో వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి ఈ పదప్రయోగాన్ని తప్పుబట్టారు. మేధావులు, విమర్శకులను లక్ష్యంగా చేసుకునేందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని ఆరోపించారు. సీపీఐ(ఎంఎల్‌) నేత దీపాంకర్‌ భట్టాచార్య కూడా మోదీ వ్యాఖ్యలను విమర్శించారు.
Advertisement
Kiren Rijiju
Narendra Modi
Dimagi Naxals
Urban Naxals
Independence Day speech
P Chidambaram

More Telugu News