వైసీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు: కాకాణి గోవర్ధన్
- మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను జైల్లో పరామర్శించిన కాకాణి గోవర్ధన్, అంబటి రాంబాబు
- ముస్తఫాతో పాటు ఆయన కొడుకుపై కూడా తప్పుడు కేసు పెట్టారన్న కాకాణి
- ముస్తఫాకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారన్న అంబటి
కిడ్నాప్ కేసులో అరెస్టై నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో కాకాణి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం కావాలనే వైసీపీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తఫాతో పాటు ఆయన కుమారుడిపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనతో పాటు అంబటి రాంబాబు కూడా జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
కేవలం వ్యాపార సంబంధిత వివాదాన్ని రాజకీయంగా మార్చి, ముస్తఫాకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో సహా బనాయించిన కేసులన్నీ అక్రమమేనని విమర్శించారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయం కూటమి నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.