రైతుల పేరుతో జగన్ రాజకీయ డ్రామా: టీడీపీ ఎంపీలు

YS Jagan Mohan Reddy political drama in the name of farmers say TDP MPs
  • జగన్ పర్యటన రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శ
  • నిందితులపై ప్రేమ చూపే పార్టీకి రైతులపై ప్రేమ ఎక్కడిదన్న ఎంపీ సతీశ్ బాబు
  • వైసీపీ హయాంలో పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని ఆరోపణ
  • ప్రస్తుత ప్రభుత్వం రూ.188 కోట్లతో పొగాకు కొనుగోలు చేస్తోందని వెల్లడి
  • 45,000 మంది రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్న ఎంపీ సతీశ్ బాబు
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటన పొగాకు రైతుల సంక్షేమం కోసం కాదని, అది కేవలం "రఫ్పా-రఫ్పా రాజకీయాల" కోసమేనని టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఎంపీలు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పరిధిలోని పొగాకు సాగు ప్రాంతాల్లో జగన్ పర్యటించిన నేపథ్యంలో సతీశ్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. "హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన వారి పట్ల సానుభూతి చూపే పార్టీ, ఇప్పుడు పొగాకు రైతులపై కపట ప్రేమను నటిస్తోంది. ఇది ప్రజలను మభ్యపెట్టేందుకు ఆడుతున్న నాటకం" అని ఆయన ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని, తుపానుల కారణంగా నష్టపోయిన రైతులకు కనీస పరిహారం సైతం అందజేయలేదని సతీశ్ బాబు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం విత్తనం వేసిన నాటి నుంచి పంట విక్రయించే వరకు రైతులకు అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ, రూ.188 కోట్లతో పొగాకు కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేకాకుండా, 45,000 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు.                                
Advertisement
YS Jagan Mohan Reddy
TDP MPs
Sana Satish Babu
Tobacco Farmers
Devarapalli East Godavari
Andhra Pradesh Politics

More Telugu News