Advertisement

'జెన్-జీ భుజంపై తుపాకీ.. లక్ష్యం భారతదేశం': నటి తనూశ్రీ దత్తా పోస్ట్ వైర‌ల్‌!

Tanushree Dutta says gun on Gen-Z shoulder and target is India
  • జెన్-జీ నిరసనలు ఆపి, దేశ భద్రతపై దృష్టి పెట్టాలన్న‌ తనూశ్రీ దత్తా
  • సరిహద్దులు మూసివేయడం వల్లే కొందరు ఆందోళనలను రెచ్చగొడుతున్నారని ఆరోపణ
  • ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వాన్ని మార్చడం దేశానికి ప్రమాదకరమని హెచ్చరిక
  • పేపర్ లీక్ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తోందని, ఇక ఆందోళనలు వద్దని వ్యాఖ్య
  • 'జెన్-జీ భుజంపై తుపాకీ.. లక్ష్యం భారతదేశం' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
దేశవ్యాప్తంగా యువత (జెన్-జీ) చేపడుతున్న నిరసనలపై బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆగ్రహంలో అర్థముందని, అయితే దానిని బాధ్యతాయుతంగా ప్రదర్శించాలని సూచించారు. దేశ భద్రత, సరిహద్దు సమస్యలపై దృష్టి సారించాల్సిన కీలక తరుణమిదని, ప్రస్తుత ప్రభుత్వాన్ని అస్థిరపరచడం దేశానికే ప్రమాదమని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌తో పాటు వీడియోను కూడా పంచుకున్నారు.

'జెన్-జీ భుజంపై తుపాకీ ఉంది.. లక్ష్యం భారతదేశం' అంటూ తన పోస్ట్‌ను ప్రారంభించిన తనూశ్రీ.. "విద్యావ్యవస్థలో సంస్కరణలు ఎంతో దూరంలో లేవు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. ఈ అంశాన్ని పక్కనపెట్టి, దేశ సరిహద్దులను సురక్షితం చేయడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది" అని పేర్కొన్నారు. చక్కగా పనిచేస్తున్న పరిపాలనా వ్యవస్థను భావోద్వేగాలకు లోనై, గుంపు ప్రభావంతో ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు.

ఈ నిరసనల వెనుక మరో కోణం ఉందని తనూశ్రీ అభిప్రాయపడ్డారు. "ప్రస్తుతం దేశంలోని అగ్రశ్రేణి పాలకులలో ఎవరి రాజీనామా అయినా దేశానికి హానికరం. చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఉన్నాయి. మోదీ, అమిత్ షా కలిసి బంగ్లాదేశ్ సరిహద్దును దాదాపు మూసివేశారు. అక్కడ జరుగుతున్న అక్రమ చొరబాట్లు, కార్యకలాపాలు ఆగిపోయాయి. దాని ప్రతిచర్యే ఇప్పుడు కనిపిస్తోంది" అని తనూశ్రీ వివరించారు. సరిహద్దులు మూసివేయడం ఇష్టం లేని శక్తులే ఈ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.

యువతను ఉద్దేశించి.. "మీరంటే మాకు ప్రేమ ఉంది. పేపర్ లీక్ కారణంగా మీ ఆగ్రహం సరైనదే. కానీ, ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు? రాజకీయాలు ఎప్పుడూ నలుపు-తెలుపుల్లో ఉండవు. చాలాసార్లు గ్రే జోన్‌లో ఉంటాయి. ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా ఉండండి" అని తనూశ్రీ సూచించారు. 

"ప్రస్తుతం నాయకత్వాన్ని మార్చడమంటే మన దేశాన్ని సరిహద్దుల వద్ద బలహీనపరచడమే. దేశ శత్రువులు కోరుకునేది కూడా ఇదే. ఈ విషయాన్ని యువత అర్థం చేసుకోవాలి" అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. తనూశ్రీ దత్తా పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 
Advertisement
Tanushree Dutta
Gen Z protests India
National security
Narendra Modi Amit Shah
Bangladesh border issue
Paper leak controversy

More Telugu News