చర్చకు నేనొస్తా... మంత్రి నారా లోకేశ్ కు పేర్ని నాని బహిరంగ సవాల్
- డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న పేర్ని నాని
- డీఎస్సీ అవకతవకలపై చర్చకు రావాలని లోకేశ్ కు సవాల్
- చంద్రబాబు వస్తే చర్చకు జగన్ వస్తారని వ్యాఖ్య
డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయంటూ మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ అవకతవకలపై బహిరంగ చర్చకు రావలసిందిగా ఆయన లోకేశ్ కు సవాల్ విసిరారు. ఒకవేళ చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే వైసీపీ నుంచి జగన్ వస్తారని... లోకేశ్ వస్తే స్వయంగా తానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వం దీనిని 'మెగా డీఎస్సీ' అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, లోపల జరిగిన అక్రమాల వల్ల ఇది 'దగా డీఎస్సీ'గా మారిందని మండిపడ్డారు. మంత్రిగా లోకేశ్ విద్యాశాఖ బాధ్యతలను పక్కనబెట్టి మిగిలిన అన్ని శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. కొంచెమైనా నైతికత ఉంటే ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, డీఎస్సీ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం తమ సొంత ప్రచార సాధనాలు, పత్రికల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమ మంత్రి పదవి కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారంటూ చేశారు.