అశోక్ గజపతిరాజు భూమి వ్యవహారంలో కఠిన చర్యలు తప్పవు: అనగాని సత్యప్రసాద్
- వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలపై చర్యలు ఉంటాయన్న అనగాని
- అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకోలేరని హెచ్చరిక
- కొందరు స్వార్థపరులు పన్నుతున్న ఉచ్చులో ప్రజలు పడొద్దని సూచన
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమి వ్యవహారంలో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారితో పాటు... తమ్మినేని భూ అక్రమాలపైనా కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన ప్రతి భూ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయం కోసం అక్రమాలకు పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు.
ఇదే సమయంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకే 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను' (ఆర్ఎస్కే) తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. రెవెన్యూ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక సంస్కరణల్లో ఆర్ఎస్కేలు కీలక భాగమని, ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఏ ఒక్కరికీ నష్టం కలిగించవని తెలిపారు. ఇప్పటికే డాక్యుమెంట్ రైటర్లతో చర్చలు జరిపామని, వారు కూడా ఈ సేవా కేంద్రాల ఏర్పాటుపై ఎంతో సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
రాజకీయాల కోసం స్వార్థపూరితంగా కొందరు పన్నుతున్న ఉచ్చుల్లో డాక్యుమెంట్ రైటర్లు, ప్రజలు పడొద్దని మంత్రి కోరారు. గొడ్డలి పార్టీ కేవలం తమ రాజకీయ స్వలాభం కోసమే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన ఘాటుగా విమర్శించారు. వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఈ మార్పులను వేగవంతం చేస్తోందని తెలిపారు.