ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం... ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

Chandrababu Naidu reviews arrangements for Bhogapuram Airport inauguration on August 1
  • ఉత్తరాంధ్రకు ఇది మణిహారంగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు
  • ఎయిర్‌పోర్ట్‌తో పాటు పలు విద్యా, నైపుణ్య కేంద్రాలకు శ్రీకారం
  • భూములిచ్చిన రైతులకు గౌరవంగా ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం
  • ప్రారంభోత్సవ వేడుకపై పది రోజుల పాటు విస్తృత ప్రచారానికి ఆదేశం
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని, దీని ప్రారంభోత్సవాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా, అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఉత్తరాంధ్ర సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘన స్వాగతం పలకాలని సీఎం సూచించారు. థింసా, సవర, కొమ్ము కోయ వంటి గిరిజన సంప్రదాయ నృత్య రూపాలతో ఆయనకు స్వాగతం పలకాలని తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ విమానాశ్రయ పాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు, జీఎంఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీలకు కూడా శ్రీకారం చుట్టనున్నారని అధికారులు వివరించారు. ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణానికే కాకుండా, ఒక కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా మారి ప్రపంచవ్యాప్త కనెక్టివిటీని అందిస్తుందని, తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక "గేమ్ ఛేంజర్" అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించడం విశేషం. ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. హాజరయ్యే వారి కోసం అల్పాహారం, భోజనం, తాగునీటి సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు.

ఈ చారిత్రాత్మక ఘట్టంపై జూలై 21 నుంచి 31 వరకు పది రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు. ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటికీ ఈ వేడుక స్ఫూర్తి చేరేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ స్వయంగా ప్రమోట్ చేస్తున్న అరకు కాఫీ బ్రాండింగ్‌కు కూడా ఈ కార్యక్రమాన్ని వేదికగా మలచాలని చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో హోం మంత్రి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సివిల్ ఏవియేషన్ అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

గిరిజన సమస్యలపై త్వరలో చర్చలు.. జీవో 3పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

గిరిజన హక్కులకు తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, వారి సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే గిరిజన సంఘాలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని విమర్శించారు. "2000 సంవత్సరంలో మేం తెచ్చిన ఈ జీవోను కాపాడటంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు దీని ప్రయోజనాలను గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎలా న్యాయం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం" అని ఆయన వివరించారు.

ఈ ప్రక్రియలో గిరిజన సంఘాలను భాగస్వాములను చేయాలని, వారి సూచనలు కూడా తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. సమీక్షలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్‌ 1లోకి, పోలవరం జిల్లాను జోన్ 2లోకి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. బాక్సైట్ విషయంలో గిరిజనులు ఆందోళన చెందవద్దని, వారి హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని హామీ ఇచ్చారు. 1/70 చట్టం అమలుపై కూడా ఎటువంటి అనుమానాలు అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, సీఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Bhogapuram Airport
Narendra Modi
North Andhra Development
Alluri Sitarama Raju International Airport
Andhra Pradesh Infrastructure

More Telugu News