ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేటీకరణ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు సమాధానం ఇదే!

Chandrababu Naidu clarifies on Sub Registrar office privatization rumors in Andhra Pradesh
  • సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవమన్న చంద్రబాబు
  • పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అని వివరణ
  • దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
  • ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసేవారిని గుర్తించాలని సూచన
  • రాష్ట్రంలో 49% వర్షపాత లోటు.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన, సులభతరమైన సేవలు అందించేందుకే 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు' (RSK) ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను స్థాపిస్తున్నాం. ఇది ఎంతమాత్రమూ ప్రైవేటీకరణ కాదు" అని తేల్చిచెప్పారు. డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగానే ఈ కేంద్రాలు పనిచేస్తాయని, వాటి పనివిధానాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వల్ల ఆ ప్రక్రియ ఎంత సులువుగా మారిందో, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా అదే విధంగా మారుతుందని ఆయన వివరించారు.

కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ కేంద్రాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. "వాస్తవాలను ప్రజలకు వివరించి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదే. ఇక డాక్యుమెంట్ రైటర్లు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి ఉపాధికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాం" అని భరోసా ఇచ్చారు.

వివిధ అంశాలపై సీఎం కీలక ఆదేశాలు
సమీక్షలో భాగంగా పలు ఇతర అంశాలపైనా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 'దీపం-2.0' పథకం లబ్ధిదారులకు సబ్సిడీ చెల్లింపులను క్రమబద్ధంగా చేపట్టాలని, వీలైతే నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేసేలా చూడాలని సూచించారు. పౌరసరఫరాల, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, సాంకేతిక అంశాలను పరిశీలించి దీనిని అమలు చేయాలన్నారు.

అదేవిధంగా, కేవలం ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రయోజనం లేని ఫిర్యాదులు చేసే 'లిటిగెంట్ పిటిషనర్ల'ను గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. "రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 81 మందిని గుర్తించాం. ఒక్కొక్కరు సగటున 246 పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. వీరి వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపాలి. ప్రజాప్రయోజనం ఉన్న పిటిషన్లను తప్పక పరిశీలించాలి, కానీ దురుద్దేశంతో వేసే వాటిని గుర్తించాలి" అని అన్నారు. ఆర్థికేతర ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఆర్థికపరమైన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో 49 శాతం వర్షపాత లోటు ఉందని, దీని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలు అన్వేషించాలని సీఎం సూచించారు. రైతుల్లో అవగాహన కల్పించి, మెట్ట పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Registration Seva Kendras
Sub Registrar Office Privatization rumors
AP Government Registration reforms
Deepam 2.0 scheme subsidy
RSK centers Andhra Pradesh

More Telugu News