వినాయక చవితి సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక పిలుపు

Bhagyanagar Utsav Samithi key call on the occasion of Vinayaka Chavithi
  • గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఎగరేయాలని ఉత్సవ సమితి పిలుపు
  • సెప్టెంబర్ 17న వందేమాతరం గీతాలాపన చేయాలని సూచన
  • వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం
  • యువతకు సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలని కోరిన కమిటీ
  • మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, 'వందేమాతరం' గీతాన్ని ఆలపించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించింది.

మూసాపేట్‌లోని పుల్లారెడ్డి పాఠశాలలో సోమవారం ఉత్సవ సమితి అధ్యక్షుడు జి. రాఘవ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 32 కేంద్రాల నుంచి 64 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ, యువతలో దేశభక్తిని పెంపొందించడం, సాంస్కృతిక విలువలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

యువతరానికి సనాతన ధర్మంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ కోరింది. కుల వివక్షను రూపుమాపి, హిందూ ఐక్యతను బలోపేతం చేసేందుకు సంత్ రవిదాస్ 650వ జయంతిని, అలాగే సామాజిక చైతన్యం కోసం విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ జయంతిని వైభవంగా నిర్వహించాలని సూచించారు.

ఉత్సవాల ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, పండుగపై జరిగే దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా, స్థానిక సంస్థల ద్వారా నిధులు కేటాయింపుతో పాటు పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువత డీజే సంస్కృతికి దూరంగా ఉంటూ, దేశభక్తిని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే భజన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, 25న నిమజ్జన మహోత్సవం జరగనుంది. హైదరాబాద్‌లో సుప్రసిద్ధమైన ఖైరతాబాద్ గణేశ్ ఈసారి 69 అడుగుల ఎత్తులో 'పంచముఖ సంకటహర మహా గణపతి'గా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Advertisement
Bhagyanagar Ganesh Utsav Samithi
Ganesh Chaturthi celebrations
Vande Mataram 150 years

More Telugu News