అధ్యాపకుల భర్తీలో అవకతవకలు సహించం: మంత్రి లోకేశ్ హెచ్చరిక

Nara Lokesh warns against irregularities in university faculty recruitment
  • యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తీ పారదర్శకంగా చేపట్టాలని ఆదేశం
  • అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • పరిశ్రమలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు
  • కెరీర్ గైడెన్స్ కోసం 'నైపుణ్యం' పోర్టల్ ఏర్పాటుకు సన్నాహాలు
  • ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్లేస్‌మెంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచన
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, ఏ చిన్న ఉల్లంఘన జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీలో విశ్వవిద్యాలయాలు, వైస్ ఛాన్సలర్లు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల కోసం మొత్తం 1,90,509 దరఖాస్తులు రాగా, వాటిలో 1,51,836 అర్హమైనవిగా తేల్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అర్హతలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరించి, 27వ తేదీన అర్హుల తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూల ప్రక్రియను కూడా ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా నిర్వహించాలని లోకేశ్ ఆదేశించారు. 

ప్రైవేటు యూనివర్సిటీల అనుమతుల విషయంలో యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సెట్ల నిర్వహణను వేగవంతం చేసి, సకాలంలో అడ్మిషన్లు పూర్తి చేయాలని సూచించారు.

యువత నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి

అనంతరం నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన మంత్రి, ఇప్పటివరకు నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1.37 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు మరింత సౌలభ్యంగా ఉండేలా జాబ్ మేళాలను కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి ఐటీఐని ఏదో ఒక పరిశ్రమతో అనుసంధానించి, స్కిల్ గ్యాప్‌ను భర్తీ చేయాలని ఆదేశించారు. 

రాష్ట్రానికి కొత్తగా రాబోయే పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్స్‌ను సిద్ధం చేసేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని, ఇందుకుగాను 81 ఇండస్ట్రీ-అకాడెమియా భాగస్వామ్యాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.

ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌ అందించేలా 'నైపుణ్యం పోర్టల్'ను తీర్చిదిద్ది, వచ్చే నెలలో ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే ఉద్యోగావకాశాలు, అవసరమైన నైపుణ్యాలపై సమాచారం అందుతుందని అధికారులు వివరించారు. ప్రతి విద్యార్థికి ఆన్‌లైన్‌లో స్కిల్ పాస్‌పోర్టు అందించడంతో పాటు, రాష్ట్రంలోని 169 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్లేస్‌మెంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని లోకేశ్ సూచించారు. ఫలితాల సాధనే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ఈ సమావేశంలో ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవో గణేశ్ కుమార్, సీడాప్ సీఈవో నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
AP University Faculty Recruitment
Andhra Pradesh Assistant Professor Jobs
AP Skill Development Department
Naipunyam Portal Launch
AP Higher Education Reforms

More Telugu News