కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కుమార్తె క్రాంతికి తీవ్ర అవమానం.. ముద్రగడ చివరి చూపునకు నో!

Mudragada Padmanabham death tension in Kirlampudi as daughter Kranti denied last look
  • ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో కన్నుమూత
  • కిర్లంపూడిలో పార్థివదేహం వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • తండ్రి చివరి చూపు కోసం వచ్చిన కుమార్తె క్రాంతికి నిరాకరణ
  • అడ్డుకున్న ముద్రగడ భార్య, బంధువులు.. వెనుదిరిగిన క్రాంతి
  • రాజకీయ, కుటుంబ విభేదాలే కారణమని స‌మాచారం
మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం (72) నిన్న‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ‌ ఉదయం ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామమైన కిర్లంపూడికి తరలించారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే, తండ్రికి నివాళులు అర్పించేందుకు ఆయన కుమార్తె క్రాంతి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తండ్రి పార్థివదేహాన్ని చూసేందుకు వచ్చిన క్రాంతిని, ముద్రగడ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ముఖ్యంగా ముద్రగడ అర్ధాంగి తన కుమార్తెను మృతదేహం వద్దకు కూడా రానివ్వలేదు. "అసలు ఇక్కడికి రావద్దు, ఆమెను వెంటనే పంపించేయండి" అంటూ గట్టిగా కేకలు వేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 

తన తండ్రిని చివరిసారిగా ఒక్కసారి చూడనివ్వమని క్రాంతి కన్నీటితో వేడుకున్నా కుటుంబ సభ్యులు కనికరించలేదు. పోలీసులు జోక్యం చేసుకుని, సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో తీవ్ర వేదనతో క్రాంతి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రత్తిపాడు వద్ద పోలీసులు క్రాంతిని ఆపి, పరిమిత సంఖ్యలో వెళ్లాలని సూచించగా, ఆమె అంగీకరించి కిర్లంపూడికి వచ్చారు. అయినప్పటికీ ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది.

రాజకీయ విభేదాలతో ముదిరిన బంధం
ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి మధ్య కొంతకాలంగా కుటుంబపరమైన విభేదాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ విభేదాలు తారస్థాయికి చేరాయి. ముద్రగడ వైసీపీలో చేరగా, క్రాంతి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రాజకీయ వైరుధ్యం వారి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తండ్రీకూతుళ్లు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

గతేడాది ముద్రగడ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన్ను చూసేందుకు వెళితే తన సోదరుడు గిరి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని, ఆయన్ను అందరి నుంచి దూరం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన మరణానంతరం కూడా చివరి చూపునకు నోచుకోకపోవడం, వారి కుటుంబంలో ఉన్న విభేదాల తీవ్రతకు అద్దం పడుతోంది.  
Advertisement
Mudragada Padmanabham
Mudragada Padmanabham daughter Kranti
Kirlampudi tension
Kapu leader Mudragada Padmanabham death
YSRCP leader Mudragada Padmanabham
Mudragada Padmanabham funeral

More Telugu News