ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్.. 32 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

Vijay keeps his word providing government jobs for 32 families
  • కరూర్ తొక్కిసలాట బాధితులకు నియామక పత్రాలు అందించిన ముఖ్యమంత్రి
  • బాధితుల కష్టాలు చూసి భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి
  • బాధితుల స్మారకార్థం మెమోరియల్ నిర్మిస్తామని ప్రకటన
  • కొనసాగుతున్న సీబీఐ విచారణ, ప్రతిపక్షాల విమర్శలు
గతేడాది టీవీకే ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పరామర్శించారు. ఈ దుర్ఘటన జరిగి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఈ తరుణంలో, శుక్రవారం ఆయన కరూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను ఆయన స్వయంగా అందజేశారు.

కరూర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, బాధిత కుటుంబాల్లోని అర్హులైన 32 మందికి వారి విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను కేటాయించారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఎస్పీ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో నియామకాలు జరిగాయి. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని, తమ గోడు విని ఆయన కంటతడి పెట్టుకున్నారని బాధితురాలు ధనలక్ష్మి పేర్కొన్నారు. 

ఈ ప్రమాదంలో భర్తను కోల్పోయిన నివేదిక అనే మహిళకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం లభించగా, ఈ నియామకం తమ కుటుంబ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల పరిహారం అందజేయగా, టీవీకే పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, కరూర్ తొక్కిసలాట ఘటన తన జీవితంలో ఒక మాయని గాయమని, అత్యంత బాధాకరమైన అనుభవమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ర్యాలీలో పోలీసుల భద్రతా ఏర్పాట్లను విశ్వసించానని, అయితే జన నియంత్రణలో వైఫల్యాలు ఎందుకు చోటుచేసుకున్నాయన్న అంశంపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. మృతుల జ్ఞాపకార్థం పార్టీ తరఫున ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement
Vijay
Tamil Nadu CM
TVK Rally Stampede
Karur Government Jobs
Victim Family Compensation

More Telugu News