కడియం శ్రీహరిది కపట బుద్ధి.. నా శాఖను హైజాక్‌ చేశారు: కొండా సురేఖ

Konda Surekha slams Kadiyam Srihari for hijacking her department
  • పీసీసీ చీఫ్‌కు సురేఖ ఫిర్యాదు
  • కడియంపై చర్యలు కోరిన మంత్రి
  • తనకు తెలియకుండా తన దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించారని ఫిర్యాదు
  • సీఎం, మీనాక్షి నటరాజన్‌ దృష్టికీ తీసుకెళ్లినట్లు వెల్లడి
  • ఎదుటివాళ్ల ఎదుగుదలను కడియం ఓర్వలేరని విమర్శ
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను కలిసిన సురేఖ తన అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కడియంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

టీవీ9తో మాట్లాడుతూ.. తాను బాధ్యతలు చూస్తున్న దేవాదాయ శాఖలోకి తనకు సమాచారం ఇవ్వకుండా కడియం వచ్చి కమిషనర్‌తో సమీక్ష నిర్వహించారని సురేఖ ఆరోపించారు. ఏ పౌరుడైనా శాఖ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇవ్వొచ్చని, కానీ సమీక్షలు నిర్వహించడం మాత్రం తన శాఖను హైజాక్‌ చేసినట్టేనని వ్యాఖ్యానించారు. మంత్రి, ఎమ్మెల్యే బాధ్యతల మధ్య తేడా తెలుసుకోవాలని కడియానికి సూచించారు.

ఈ సందర్భంగా కడియంపై సురేఖ వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. తాను సీనియర్‌నని, ఎన్నోసార్లు మంత్రిగా పనిచేశానని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేసి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి ఇప్పుడు నీతి గురించి మాట్లాడటం సరికాదని విమర్శించారు.

తాను కేవలం వినతిపత్రం మాత్రమే ఇచ్చానని, అపార్థం జరిగిందని కడియం చెప్పిన వివరణను కూడా సురేఖ ఖండించారు. సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కడియమే ప్రెస్‌నోట్‌ విడుదల చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు కూడా వివరించినట్లు వెల్లడించారు.

కడియం కపట బుద్ధితో వ్యవహరిస్తున్నారని సురేఖ ఆరోపించారు. ఎదుటివారి ఎదుగుదలను ఆయన సహించరని విమర్శించారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉండటం జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరిన తర్వాతే గ్రూపు రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు.

మరోవైపు కడియం-సురేఖ వివాదాన్ని పరిష్కరిస్తామని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Advertisement
Konda Surekha
Kadiyam Srihari
Telangana Congress
Mahesh Kumar Goud
Warangal Politics
Endowments Department

More Telugu News