మావిగన్పై వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- మావిగన్ వల్ల వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్న పెద్దిరెడ్డి
- ఇదంతా చంద్రబాబు, ఆయన అనుచరులు చేస్తున్న కుట్ర అని మండిపాటు
- రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి కాదని వ్యాఖ్య
'మావిగన్' రాజధాని ప్రతిపాదనపై వైసీపీ నేతల్లో తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. "మావిగన్ అంశంపై మా పార్టీలో ఎలాంటి విభేదాలూ లేవు. ఈ విషయంలో పార్టీ నేతలు వైసీపీని వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం అంతా పచ్చి అబద్ధం. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులు కలిసి చేస్తున్న కుట్రపూరిత ప్రచారం మాత్రమే" అని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ త్రీ-సిటీ (మావిగన్) మెగా రీజియన్ వల్ల వెనుకబడిన ప్రాంతాలన్నీ అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. "మావిగన్ ప్రతిపాదనపై ఎవరికైనా అసంతృప్తి ఉందీ అంటే... అది కేవలం చంద్రబాబుకు మాత్రమే. ప్రజల్లో మాత్రం దీనికి పూర్తి ఆమోదం, మద్దతు ఉన్నాయి" అని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమరావతి ప్రాజెక్టుపై మండిపడుతూ... అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వాటిని పూర్తిగా వృథా చేస్తున్నారని, ప్రజలకు అస్సలు ఉపయోగపడని రీతిలో భారీ ఖర్చులు పెడుతూ రాష్ట్ర భవిష్యత్తును భారం చేస్తున్నారని విమర్శించారు.
ఇటీవల హాట్ టాపిక్గా మారిన యూట్యూబర్ 'రావణ్' వ్యవహారంపై పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించారని... ఆయన్ను తీసుకొచ్చి మాట్లాడించాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. చిత్తూరు జిల్లాలో ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ సక్రమంగానే సాగుతున్నప్పటికీ... సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో మాత్రం తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసమే జీవించిన అసలైన ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా జనం గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. నాడు ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక పథకాలు తెలుగు రాష్ట్రాల్లోని నిరుపేదలకు ఒక వరంలా మారాయని చెప్పారు.