ముఖాలు మారినా పద్ధతులు మారలేదు: 'అమ్మ'కు రేవతి, పద్మప్రియ రాజీనామా!
- మలయాళ సినీ నటుల సంఘం 'అమ్మ'లో ముదిరిన సంక్షోభం
- ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవతి, పద్మప్రియ
- ‘అమ్మ’లో ఇంకా పితృస్వామ్య ధోరణులు కొనసాగుతున్నాయని విమర్శ
మలయాళ సినీ తారల సంఘం ‘అమ్మ’లో సంక్షోభం మరింత ముదిరింది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత చెలరేగిన వివాదాల నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు మోహన్లాల్, ఆయన కార్యవర్గం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ‘అమ్మ’కు తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టిస్తూ నటి శ్వేతా మీనన్ బాధ్యతలు చేపట్టారు. అయితే, తాజాగా జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమె కమిటీపై కూడా పలు ఆరోపణలు రావడంతో శ్వేతా మీనన్తో పాటు మొత్తం కార్యవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేసింది. ఈ తీవ్ర అనిశ్చితి మధ్య, పరిశ్రమలోని సీనియర్ నటీమణులు రేవతి, పద్మప్రియ సైతం ‘అమ్మ’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం మలయాళ చిత్రసీమలో సంచలనంగా మారింది.
పని ప్రదేశాల్లో మహిళల భద్రత, సమాన వేతనాల కోసం పోరాడుతున్న ‘విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (WCC) వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న రేవతి, పద్మప్రియ ఈ నిర్ణయంపై ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సంస్థలో అధికారం చేతులు మారినప్పటికీ ప్రాధాన్యతలు మారలేదని, ‘అమ్మ’లో ఇంకా పితృస్వామ్య ధోరణులు, అధికార రాజకీయాల ప్రభావం కొనసాగుతూనే ఉందని వారు ఆరోపించారు.
తాము ఎన్నో దశాబ్దాలుగా ఈ రంగానికి సేవ చేశామని, భవిష్యత్తు మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మలయాళ సినిమా ఎప్పటికీ తమదేనని, దాని కోసం పనిచేయడానికి ఎలాంటి సంస్థ సభ్యత్వాలు అవసరం లేదని వారు కుండబద్దలు కొట్టారు.
ఈ సందర్భంగా వ్యవస్థ తీరుపై వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో సంస్థను వీడటం ఓటమి కాదని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే నిర్ణయమని పేర్కొన్నారు. గత పదేళ్లుగా మహిళలకు సురక్షితమైన పని వాతావరణం, సమాన హక్కుల కోసం తాము చేసిన డిమాండ్లకు కేవలం మౌనం, ఒంటరితనం మాత్రమే సమాధానాలుగా లభించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హేమా కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో జరిగిన రాజీనామాలు నైతిక బాధ్యతతో కూడినవి కావని, కేవలం జవాబుదారీతనం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు మాత్రమేనని మండిపడ్డారు. అధికారం తనను తాను రక్షించుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతుందని, ముఖాలు మారినా అసమానతల వ్యవస్థ అలాగే ఉందని విమర్శించారు. అయితే, రాబోయే తరాల మహిళలు ఈ పోరాటాలు చేయాల్సిన అవసరం లేని రోజు వస్తుందని తాము బలంగా నమ్ముతున్నట్లు రేవతి, పద్మప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు.