రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటించనున్న జగన్
- రేపు ఉదయం 11.30 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్
- రేపు రాత్రికి పులివెందులలోనే బస
- ఎల్లుండి ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపటి నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... రేపు ఉదయం 11.30 గంటలకు జగన్ పులివెందుల చేరుకుంటారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ప్రజలు, నాయకులను కలుసుకుంటారు. అక్కడ 'ప్రజాదర్బార్' నిర్వహించి, ప్రజల నుంచి స్వయంగా వినతులు, సమస్యల అర్జీలను స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు.
బుధవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఆయన ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకుని.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ సంస్మరణ కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్ అక్కడి నుంచి తిరుగుప్రయాణం అవుతారు.