యువ సంచలనం వైభవ్కు అవకాశం ఎప్పుడు?.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
- యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కొనసాగుతున్న చర్చ
- కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్పై విమర్శలకు స్పందించిన రాజీవ్ శుక్లా
- వైభవ్కు సరైన సమయంలో అవకాశం వస్తుందని హామీ
- ఆటగాళ్ల ఎంపికపై తుది నిర్ణయం జట్టు యాజమాన్యానిదేనని స్పష్టీకరణ
'టైమ్స్ నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. "వైభవ్ చాలా ప్రతిభావంతుడైన ఆటగాడనే అభిప్రాయం మాకూ ఉంది. ఐపీఎల్లో దాన్ని నిరూపించుకున్నాడు. అయితే, కోచ్, కెప్టెన్పై వస్తున్న కొన్ని వ్యాఖ్యలను నేను గమనించాను. తుది జట్టు ఎంపికపై నిర్ణయం పూర్తిగా కోచ్, కెప్టెన్దేనని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. వాళ్లు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సరైన అవకాశం వచ్చినప్పుడు, వాళ్లే తప్పకుండా అతడికి అవకాశం కల్పిస్తారు" అని వివరించారు.
ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ వెలుగులోకి వచ్చాడు. ఆ టోర్నీలో 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు. ముఖ్యంగా 237.30 స్ట్రైక్ రేట్తో పరుగులు చేయడం అతడిని జాతీయ జట్టులోకి తీసుకువచ్చింది. దీంతో ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో అతడి అరంగేట్రం ఖాయమని అందరూ భావించారు. అయితే, తొలి టీ20లో టీమ్ మేనేజ్మెంట్ అనుభవజ్ఞులైన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ల ఓపెనింగ్ జోడీకే ప్రాధాన్యత ఇచ్చింది. గత నెలలో ఐర్లాండ్తో జరిగిన సిరీస్లోనూ వైభవ్ను బెంచ్కే పరిమితం చేయడంతో విమర్శలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో శుక్లా తన స్పందనను కొనసాగిస్తూ.. "ఇలాంటి నిర్ణయాలను జట్టు యాజమాన్యం విజ్ఞతకే వదిలేయాలి. దీనిపై ఎందుకు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు" అని అన్నారు. సెలక్టర్లు అతడి ప్రతిభను గుర్తించి జట్టులోకి తీసుకున్నప్పటికీ, తుది జట్టులో చోటు కల్పించేందుకు మాత్రం టీమ్ మేనేజ్మెంట్ తొందరపడటం లేదని ఈ వ్యాఖ్యలతో స్పష్టమైంది. దీంతో ఈ యువ కెరటం తన అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.