ఆ విష‌యంలో ధోనీ, జొకోవిచ్ ఒకటే.. వారి నుంచి నేర్చుకోవాలి: దీప్తి శర్మ

Deepti Sharma says Dhoni and Djokovic are the same in one aspect and we should learn from them
  • ఎంఎస్ ధోనీని టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో పోల్చిన దీప్తి శర్మ
  • ఒత్తిడిలోనూ ఇద్దరూ ప్రశాంతంగా ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు
  • వింబుల్డన్ మ్యాచ్ చూడాలన్న తన కల నెరవేరిందని వెల్లడి
  • తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్ అని తెలిపిన భారత ఆల్‌రౌండర్
  • సచిన్, గవాస్కర్, రవిశాస్త్రితో కలిసి మ్యాచ్ చూడాలని ఉందని వ్యాఖ్య
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, 24 గ్రాండ్‌స్లామ్‌ల విజేత, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ల మధ్య ఒక ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించింది. అత్యంత క్లిష్టమైన, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ ఇద్దరూ ఒకే రకమైన ప్రశాంతతను, సంయమనాన్ని ప్రదర్శిస్తారని దీప్తి పేర్కొంది. ప్రస్తుతం వింబుల్డన్ టోర్నమెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న దీప్తి, ఈ ఇద్దరు క్రీడా దిగ్గజాల మానసిక దృఢత్వాన్ని ప్రశంసించింది.

జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ దీప్తి శర్మ తన అభిప్రాయాలను పంచుకుంది. "జొకోవిచ్ గురించి మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరూ అతని మానసిక బలం గురించే చర్చిస్తారు. పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా అతను ఎప్పటికీ వెనక్కి తగ్గడు. క్రికెట్‌లో ఎంఎస్ ధోనీ కూడా అచ్చం ఇలాగే ఉంటాడని నేను భావిస్తున్నా. అత‌డు ఎంతో కూల్‌గా, ప్రశాంతంగా ఉంటాడని పేరుంది. ఒత్తిడితో కూడిన సమయాల్లో అత‌డు వాటిని అద్భుతంగా ఎదుర్కొంటాడు. జొకోవిచ్ ఎప్పుడూ కష్టాల్లో ఉన్నట్లు కనిపించడు. ఒత్తిడిని చాలా తేలికగా తీసుకుంటాడు" అని వివరించింది. 

"జొకోవిచ్, ధోనీ ఇద్దరిలోనూ కీలక సమయాల్లో ప్రశాంతంగా, బలంగా ఉండే అరుదైన గుణం ఉంది. వారిని చూడటం ద్వారా, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నిలదొక్కుకోవాలో, ఎలా పరిష్కారం కనుగొనాలో మనం నేర్చుకోవచ్చు" అని దీప్తి  తెలిపింది.

వింబుల్డన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటం తన చిరకాల కోరిక అని దీప్తి శర్మ ఆనందం వ్యక్తం చేసింది. "ఎప్పటికైనా వింబుల్డన్‌కు వచ్చి ఒక మ్యాచ్ చూడాలనేది నా కల. చివరకు ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలం టీవీలో చూసినదాన్ని తొలిసారి ప్రత్యక్షంగా చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోంది. ఇక్కడి వాతావరణం, ప్రేక్షకుల ఉత్సాహం, శక్తి అన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. వింబుల్డన్‌లో టెన్నిస్ చూడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.

తనకు అత్యంత ఇష్టమైన టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్ అని దీప్తి వెల్లడించింది. "నా ఫేవరెట్ జొకోవిచ్. నేను అతని ఆటను చాలా నిశితంగా గమనిస్తాను. కోర్టులో అతను పోరాడే తీరు, మానసిక స్థైర్యం, ఎప్పటికీ వదిలిపెట్టని పట్టుదల నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అతని ఆట చూడటం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది" అని చెప్పింది. గతంలో ఫెదరర్, నాదల్ వంటి గొప్ప ఆటగాళ్ల మ్యాచ్‌లను చూశానని, కానీ ఇప్పుడు ఎక్కువగా జొకోవిచ్ ఆటనే అనుసరిస్తున్నానని తెలిపింది.

వింబుల్డన్‌లో ఎవరితో కలిసి మ్యాచ్ చూడాలనుకుంటున్నారని అడగ్గా.. ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాల పేర్లను ప్రస్తావించింది. "సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్లతో కలిసి మ్యాచ్ చూడాలనుకుంటున్నాను. వారు లెజెండ్స్. వారితో కలిసి టెన్నిస్ చూడటం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. క్రీడల గురించి వారికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణలను వినడం నాకు చాలా ఇష్టం" అని దీప్తి శర్మ పేర్కొంది. కాగా, రెండు రోజుల క్రితం భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా వింబుల్డన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే.
Deepti Sharma
MS Dhoni
Novak Djokovic
Wimbledon 2024
Indian Womens Cricket Team
Mental Toughness in Sports

More Telugu News