రాముడి గుడిలోనే దొంగతనమా?: మోదీ, అమిత్ షాలపై జగ్గారెడ్డి ఆగ్రహం
- అయోధ్య రామమందిరంలో హుండీ డబ్బుల చోరీపై జగ్గారెడ్డి ఆగ్రహం
- యూపీలో, కేంద్రంలో బీజేపీ ఉన్నా దొంగతనం జరిగిందని మండిపాటు
- ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
అయోధ్య శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన హుండీ డబ్బుల చోరీ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోనూ, కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నా, రామాలయ ట్రస్ట్ వారి పరిధిలోనే నడుస్తున్నా... ఈ దొంగతనం జరిగిందని ఆయన అన్నారు. ఈ చోరీపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించకపోవడం దారుణమన్నారు. ఇన్నేళ్లుగా రాముడి పేరును కేవలం రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ కోసమే బీజేపీ వాడుకుందని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై విచారణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీల బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని, ఈ వైఫల్యానికి గాను ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై జగ్గారెడ్డి స్పందిస్తూ... కేటీఆర్ ప్రస్తుతం ఖాళీగా ఉండి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేస్తూ పాలనలో బిజీగా ఉన్నారని చెప్పారు. కేటీఆర్ ఎన్ని విమర్శలు చేసినా రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.