డిగ్రీలు కాదు... ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేదే నిజమైన విద్య: మంత్రి నారా లోకేశ్
- విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న లోకేశ్
- అన్ని వర్గాల అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారం అవుతుందని వ్యాఖ్య
- విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతామని స్పష్టం
- కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "ప్రతి తరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుంది. కానీ ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించేది విద్య మాత్రమే. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే సంస్థలు కావు. అవి కలలకు రూపమిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి, నాయకులను తయారు చేస్తాయి. ఈ రోజు జరుగుతున్నది కేవలం ఒక స్నాతకోత్సవం కాదు, ఇది అవకాశాల, సమ్మిళిత అభివృద్ధి వేడుక" అని అభివర్ణించారు.
అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే సమగ్రాభివృద్ధి
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది, అన్ని వర్గాలు భాగస్వాములైనప్పుడే వికసిత్ భారత్ సాధ్యమని లోకేశ్ తెలిపారు. "గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలుగా కాకుండా, సామాజిక పరివర్తనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఒక కుటుంబంలో తొలి తరం విద్యార్థి పట్టభద్రుడైతే, ఆ కుటుంబంతో పాటు దేశం కూడా పురోగమిస్తుంది. మన గిరిజన వారసత్వాన్ని కాపాడుకుంటూ, పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడమే వికసిత్ భారత్ స్ఫూర్తి" అని ఆయన వివరించారు.
ఏఐ యుగంలో మానవ విలువల ప్రాధాన్యం
ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో మానవ విలువల ప్రాధాన్యతను లోకేశ్ నొక్కిచెప్పారు. "ఏఐ మనకు సమాధానాలు ఇవ్వగలదు, కానీ మానవీయ విలువలు, జిజ్ఞాస, కరుణ, వ్యక్తిత్వం వంటి లక్షణాలను ఎప్పటికీ భర్తీ చేయలేదు. ఈ విలువలు గొప్ప విశ్వవిద్యాలయాల్లోనే పెంపొందుతాయి. అందుకే వర్సిటీలు నైపుణ్యం ఉన్న వృత్తి నిపుణులతో పాటు బాధ్యతాయుతమైన పౌరులను, మానవతా దృక్పథం కలిగిన నాయకులను తయారు చేయాలి" అని ఆయన ఆకాంక్షించారు.
భవిష్యత్ నాయకులను తయారు చేస్తాం
ప్రధాని మోదీ కలలుగన్న వికసిత్ భారత్ నిర్మాణంలో నాణ్యమైన విద్య, ఆవిష్కరణలే కీలకమని లోకేశ్ అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు అభినందనలు తెలుపుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు.
"మా లక్ష్యం డిగ్రీలు పొందిన విద్యార్థులను తయారు చేయడం కాదు, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడం. పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు, పరిశోధన, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ భవిష్యత్ విశ్వవిద్యాలయాలను నిర్మిస్తున్నాం. ప్రతి విద్యార్థి ఉపాధికి అర్హుడు కావాలి, ప్రతి వర్సిటీ ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలి" అని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, "డిగ్రీ మీకు వృత్తిని ఇస్తుంది, కానీ మీ వ్యక్తిత్వమే మీకు గౌరవాన్ని సంపాదిస్తుంది. సమాజానికి మీరు చేసే సేవే మీకు శాశ్వత వారసత్వాన్ని అందిస్తుంది" అని హితవు పలికారు.
అంతకుముందు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వర్సిటీ ఛాన్స్లర్ ప్రొఫెసర్ మదన్ లాల్ మీనా, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టీ.శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.