వికసిత భారత్ లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర: విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu Youth play key role in achieving Viksit Bharat goal in Visakhapatnam
  • వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి పిలుపు
  • కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో ప్రసంగం
  • పట్టభద్రుల్లో 40 శాతం, స్వర్ణ పతక విజేతల్లో 70 శాతం అమ్మాయిలేనని హర్షం
  • ఆధునిక సాంకేతికతతో గిరిజన సంస్కృతికి పునరుజ్జీవం తీసుకురావాలని సూచన
  • గిరిజన విశ్వవిద్యాలయాలు ఆత్మవిశ్వాస కేంద్రాలుగా ఎదగాలి
వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో దేశ యువతదే కీలక పాత్ర అని... విద్య, సాధికారతే వారి ప్రధాన ఆయుధాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే మన గిరిజన సంస్కృతి, వారసత్వానికి పునరుజ్జీవం తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళవారం నాడు విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పట్టాలు, పతకాలు అందుకున్న విద్యార్థులకు, వారికి మార్గనిర్దేశం చేసిన అధ్యాపకులకు, ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ యూనివర్సిటీలో పట్టాలు పొందిన విద్యార్థులలో దాదాపు 40 శాతం మంది, స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70 శాతం మంది అమ్మాయిలే కావడం పట్ల ఆమె ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. ఇది మహిళా సాధికారతకు, లింగ సమానత్వం పట్ల సంస్థకున్న నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసించారు.

గిరిజన విశ్వవిద్యాలయాలపై ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయని రాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ సంస్థలు కేవలం విద్యా కేంద్రాలుగా మిగిలిపోకుండా, గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వం, విధాన రూపకల్పనకు కేంద్రాలుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, వనాధికారాల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ఇలాంటి సంస్థలపై ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ఈ విశ్వవిద్యాలయం గిరిజన యువత సర్వతోముఖాభివృద్ధికే కాకుండా, ఈ ప్రాంత సమగ్ర వికాసానికి కూడా గణనీయమైన కృషి చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ప్రియమైన విద్యార్థులారా, ఈ స్నాతకోత్సవం మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది సంతోషించుకునే రోజే అయినా, భవిష్యత్తుపై సంకల్పం తీసుకోవడానికి కూడా ప్రేరణనిస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే యువత నూతన నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు, మీ పరిసరాల నుంచి నేర్చుకుంటూ, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆమె విద్యార్థులకు హితవు పలికారు. తమ సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధం కొనసాగిస్తూనే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు.

అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కలు, ఎకో-టూరిజం, స్థానిక నైపుణ్యాలను ప్రోత్సహించేలా గిరిజన విశ్వవిద్యాలయాల్లో నూతన ఆవిష్కరణలు జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉత్తరాంధ్ర గిరిజన తెగల సాధికారత కోసం ఈ వర్సిటీ 'సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్'ను నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి అంశాలపై ఈ విశ్వవిద్యాలయం దృష్టి సారించిందని తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమ సమాజంతో కూడిన వికసిత భారత్ నిర్మాణంలో ఈ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు.
Droupadi Murmu
Central Tribal University of Andhra Pradesh
Visakhapatnam
Viksit Bharat
Tribal Empowerment
Women Education

More Telugu News