విశాఖలో ఘనంగా గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం... రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేశ్
- విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 373 మంది విద్యార్థులకు పట్టాలు, 13 మందికి స్వర్ణ పతకాలు
- పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రధాన్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, అనిత
- రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్, స్పీకర్, మంత్రులు
ఈ స్నాతకోత్సవంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. వీరితో పాటు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కట్టమణి, రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్, అనిత ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి విశాఖపట్నంలో స్వాగతం పలకడం గౌరవంగా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మీకు హృదయపూర్వక స్వాగతం" అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.