శ్రీవారి సేవలో అనంత్ అంబానీ.. టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం
- తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ
- టీటీడీకి రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటన
- బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతాలు కూడా తామే భరిస్తామని వెల్లడి
ఇవాళ తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న అనంత్ అంబానీ, శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులతో సమావేశమైన అనంత్ అంబానీ, తిరుమలలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ భేటీలోనే ఆయన భారీ విరాళంపై ప్రకటన చేశారు. కేవలం ఎలక్ట్రిక్ బస్సులను అందించడమే కాకుండా వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ బస్సులను నడిపే డ్రైవర్ల జీతభత్యాలను సైతం పూర్తిగా రిలయన్స్ సంస్థే భరిస్తుందని స్పష్టం చేశారు. అనంత్ అంబానీ తీసుకున్న ఈ నిర్ణయంపై టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 నుంచి 26 గంటల సమయం పడుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సోమవారం నాటి వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు శ్రీవాణి దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.