ఆంథ్రోపిక్ ఏఐ మోడల్పై పాక్షికంగా ఆంక్షల ఎత్తివేత
- ఆంథ్రోపిక్ 'మైథోస్ 5' ఏఐ మోడల్పై అమెరికా ప్రభుత్వం పాక్షికంగా ఆంక్షలు ఎత్తివేత
- అమెరికన్ సంస్థలకు మాత్రమే ఈ మోడల్కు యాక్సెస్
- జాతీయ భద్రతా కారణాలతో ఈ నెల 12న ఈ మోడల్ను నిషేధించిన అమెరికా
- మరో మోడల్ 'ఫేబుల్ 5'పై కొనసాగుతున్న నిషేధం.. కొనసాగుతున్న చర్చలు
సరైన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తున్న నేపథ్యంలో, విశ్వసనీయ భాగస్వాములకు క్లాడ్ మైథోస్ 5 మోడల్ను అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతిస్తున్నట్లు వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామంపై ఆంథ్రోపిక్ స్పందిస్తూ, సైబర్ డిఫెండర్లు, కీలక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలకు వీలైనంత త్వరగా యాక్సెస్ కల్పిస్తామని వెల్లడించింది.
ఈ నెల 12న మైథోస్ 5, ఫేబుల్ 5 అనే రెండు మోడళ్లపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఏఐ మోడళ్లలోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు లేదా ఇతర దురుద్దేశపూరిత శక్తులు సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మైథోస్ 5 ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, పరిశోధనల కోసం ఉద్దేశించినది కాగా, ఫేబుల్ 5ను సాధారణ వినియోగదారుల కోసం అదనపు భద్రతా ఫీచర్లతో రూపొందించారు.
గత కొద్ది రోజులుగా ఆంథ్రోపిక్ ప్రతినిధులు, వాణిజ్య శాఖ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ తాజా నిర్ణయం వెలువడింది. సుమారు 100 అమెరికన్ కంపెనీలు, ఫెడరల్ ఏజెన్సీలకు ఈ పరిమిత అనుమతి లభించింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ పరిపాలనలో అధునాతన 'ఏఐ' మోడళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ఓపెన్ఏఐ వంటి ఇతర సంస్థలు కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోనే తమ కొత్త మోడళ్లను పరిమితంగా విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం మరో మోడల్ అయిన ఫేబుల్ 5పై నిషేధం కొనసాగుతుండగా, దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే సానుకూల ఫలితం వస్తుందని ఆంథ్రోపిక్ ఆశాభావం వ్యక్తం చేసింది.