తిరుమల కొండపై భారీ రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
- వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తిన భక్తులు
- శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు పడుతున్నట్లు టీటీడీ వెల్లడి
- వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు ఫుల్
- భక్తులకు అల్పాహారం, పాలు అందిస్తున్న టీటీడీ సిబ్బంది
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, తాగునీరు, పాలను అందిస్తున్నారు. రద్దీని కొంతమేర తగ్గించేందుకు మధ్యాహ్నం జారీ చేయాల్సిన టైమ్-స్లాట్ టోకెన్లను రెండు గంటల ముందే విడుదల చేశారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద కూడా టోకెన్ల కోసం భక్తులు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి.
కాగా, శుక్రవారం (జూన్ 26) నాడు 81,340 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 44,874 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.76 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది. వారాంతం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.