ఆపరేషన్ సిందూర్ అమరవీరులను ప్రకటించిన కేంద్రం.. జాబితాలో మన తెలుగు వీరుడు కూడా!
- పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్
- ఆరుగురు అమరవీరుల పేర్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ లోని గ్రానైట్ పలకలపై పేర్లు
- అగ్నివీర్ మురళీ నాయక్ ను అమరవీరుడిగా ప్రకటించిన కేంద్రం
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయంకర ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్ గుండెల్లో దడ పుట్టేలా జరిపిన మెగా కౌంటర్ ఆపరేషన్ ‘ఆపరేషన్ సింధూర్’. ఈ పోరాటంలో సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను భారత ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా డిక్లేర్ చేసింది. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తుగా న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (జాతీయ యుద్ధ స్మారకం) లోని ప్రత్యేక గ్రానైట్ పలకలపై వీరి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు.
ఆపరేషన్ సింధూర్లో అమరులైన ఆ ఆరుగురు భారత వీరులు వీరే:
ఈ భీకర ఆపరేషన్లో భారత సైన్యానికి చెందిన ఐదుగురు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక సర్జెంట్ వీరమరణం పొందారు.
సుబేదార్ మేజర్ పవన్ కుమార్ – హెడ్క్వార్టర్స్ 10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్.
రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్ – 4వ బెటాలియన్, జమ్మూ అండ్ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్.
లాన్స్ నాయక్ దినేష్ కుమార్ – 5 ఫీల్డ్ రెజిమెంట్.
అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్ – 851 లైట్ రెజిమెంట్ (మన తెలుగు రాష్ట్రానికి చెందిన వీరుడు కావడం విశేషం).
హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ – 237 ఫీల్డ్ వర్క్షాప్.
సర్జెంట్ సురేంద్ర కుమార్ – 39 వింగ్, భారత వైమానిక దళం.
సునీల్ కుమార్కు ‘వీరచక్ర’ - సురేంద్రకు ‘వాయుసేన మెడల్’: ఆపరేషన్ సింధూర్లో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేస్తూ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు గానూ రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్కు మరణానంతరం దేశపు మూడవ అత్యున్నత సైనిక పురస్కారమైన ‘వీరచక్ర’ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా, స్కై ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించిన ఐఏఎఫ్ సర్జెంట్ సురేంద్ర కుమార్కు మరణానంతరం ‘వాయుసేన మెడల్’తో గౌరవించింది.