రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ గురి: సోషల్ మీడియాలో భారీ మీమ్స్ క్యాంపెయిన్!
- లోక్సభ ప్రతిపక్ష నేత బాధ్యతలు వదిలి విదేశాలకు వెళ్తున్నారని విమర్శలు
- గతంలో రాహుల్ చేసిన 54 విదేశీ ప్రయాణాలను ప్రస్తావిస్తున్న బీజేపీ
- విదేశీ పర్యటనల ఖర్చులకు ఫండింగ్ ఎక్కడిదని మీమ్స్ ద్వారా ప్రశ్నలు
జూన్ 25 నుంచి ఊపందుకున్న ఈ సమన్వయ డిజిటల్ ప్రచారంలో.. బీజేపీ జాతీయ విభాగంతో పాటు వివిధ రాష్ట్రాల ఐటీ సెల్స్, పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ భారతదేశంలో జరిగే రాజకీయ పరిణామాల కంటే విదేశీ పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే కోణంలో వ్యంగ్య మీమ్స్, పోస్టులను వైరల్ చేస్తున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా కీలక బాధ్యతల్లో ఉండి కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఈ మీమ్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది కమలదళం.
ఈ ప్రచారంలో భాగంగా.. రాహుల్ గాంధీ ప్రజాప్రతినిధిగా ఉన్న కాలంలో ఇప్పటివరకు కనీసం 54 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు బీజేపీ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, వియత్నాంతో పాటు యూరప్, మిడిల్ ఈస్ట్లోని పలు దేశాలకు ఆయన వెళ్లిన పర్యటనలను ప్రస్తావిస్తున్నారు. వీటిలో కొన్ని అధికారిక పర్యటనలు కాగా, మరికొన్ని అత్యంత రహస్యంగా సాగాయని, ఈ పర్యటనల వెనుక ఉన్న పారదర్శకత ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ విదేశీ ప్రయాణాలకు అంత భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై స్పష్టత నివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సరికొత్త మీమ్స్ దాడిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ఎలాంటి సుదీర్ఘ వివరణ ఇవ్వలేదు. అయితే, గతంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్ వాటిని సమర్థించుకుంటూ వచ్చింది. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజాస్వామ్యం, ఇక్కడి పాలనలోని లోపాలను ప్రపంచానికి వివరించడానికే ఆయన విదేశీ పర్యటనలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వస్తున్నారు.