రామ్ చరణ్ ‘పెద్ది’ వివాదంపై అదా శర్మ కామెంట్స్
- 'పెద్ది' సినిమాలో జాన్వీ పాత్రపై ట్రోలింగ్
- తాను ఆ సినిమా చూడలేదన్న అదా శర్మ
- ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు
‘ది కేరళ స్టోరీ’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ త్వరలోనే ‘గవర్నర్’ అనే పవర్ఫుల్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో, చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్, 1990ల నాటి భారత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తెరకెక్కింది. ఆర్బీఐ గవర్నర్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి ఎలా రక్షించారనే యథార్థ సంఘటనల ఆధారంగా విపుల్ షా నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న విడుదల కానుంది.
ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా అదా శర్మ.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై జరుగుతున్న ట్రోలింగ్పై ఆసక్తికరంగా స్పందించారు. ‘పెద్ది’ సినిమాలో మహిళలను అభ్యంతరకరంగా చూపించారనే విమర్శలతో దర్శకుడు బుచ్చిబాబు సనా ఇప్పటికే క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించిన సంగతి తెలిసిందే.
దీనిపై అదా మాట్లాడుతూ.. తాను ఆ సినిమాలో నటించలేదని, ఇంకా చూడలేదని చెబుతూనే, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేని తన ప్రయాణం వేరని, కాబట్టి ఆ వివాదంపై మాట్లాడటం సరైంది కాదని చాకచక్యంగా తప్పించుకున్నారు. అయితే, నటీనటులు, దర్శకులు, రచయితలు ప్రాజెక్ట్లను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, మన చిన్న తప్పుడు నిర్ణయం సమాజంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మహిళలకు భిన్నమైన కోణాలు ఉన్న స్క్రిప్టులనే తాను ఇష్టపడతానని ఆమె స్పష్టం చేశారు.