ఢిల్లీ అగ్నిప్ర‌మాదం.. ప్రాణాల కోసం భవనం పైనుంచి దూకేసిన మహిళలు.. ఇదిగో వీడియో!

Viral Video Women Jump From Building To Escape Fire At South Delhi Hotel
  • దక్షిణ ఢిల్లీ హోటల్‌లో ఇవాళ‌ ఉదయం ఘోర అగ్నిప్రమాదం
  • ఈ ఘటనలో 21 మంది మృతి, వీరిలో ఎక్కువ మంది విదేశీయులు
  • ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకిన మహిళల వీడియో వైర‌ల్‌
  • వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చిన వారు బస చేసిన హోటల్‌లో దుర్ఘటన
  • గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెస్టారెంట్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనా
దక్షిణ ఢిల్లీలో ఇవాళ‌ ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హౌజ్ రాణి ప్రాంతంలోని 'ఫ్లోరిష్ స్టే' అనే హోటల్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 21 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు మహిళలు భవనం పై అంతస్తుల నుంచి కిందకు దూకేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కింద పరుపులు పరిచి వారి ప్రాణాలు కాపాడారు. తీవ్రమైన మంటల నడుమ మహిళలు కిందకు దూకుతున్న వీడియోలు అందరినీ కలచివేస్తున్నాయి.

ఐదంతస్తుల ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్‌లో తొలుత మంటలు చెలరేగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అవి వేగంగా పై అంతస్తులకు వ్యాపించడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. "ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. స్థానికులు పరుపులు వేయడం వల్లే పైనుంచి దూకిన వారు ప్రాణాలతో బయటపడగలిగారు" అని ఎస్‌డీఎం జితేంద్ర కుమార్ తెలిపారు. ఇరుకైన సందుల్లో భవనం ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది.

స్థానికుల కథనం ప్రకారం ఈ హోటల్‌లో సుమారు 25 గదులు ఉండగా, ప్రమాద సమయంలో 40 మందికి పైగా బస చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైద్య చికిత్సల నిమిత్తం భారత్‌కు వచ్చిన విదేశీయులే. ప్రమాదం జరిగినప్పుడు బాధితులంతా గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. మృతుల్లో విదేశీయులు ఉన్నారని పీటీఐ వార్తా సంస్థ సైతం తన కథనంలో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Viral Video
Women Jump From Building
Fire Accident
South Delhi Hotel

More Telugu News