రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ పై కీలక ప్రతిపాదనలు
- మాస్కోలో రష్యా స్బేర్బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్తో మంత్రి లోకేష్ భేటీ
- భారత్లో గిగాచాట్ ఏఐ, బ్యాంకింగ్ భద్రత టెక్నాలజీపై కీలక ప్రతిపాదనలు
- విశాఖ ఫార్మా, వ్యవసాయ ఎగుమతిదారులకు ప్రత్యేక రుణాలు అందించాలని విజ్ఞప్తి
- భారత్లో తమ కార్యకలాపాలను వివరించిన స్బేర్బ్యాంక్ ప్రతినిధి
- లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన బ్యాంక్ యాజమాన్యం
ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ... స్బేర్బ్యాంక్ అభివృద్ధి చేసిన 'గిగాచాట్ ఎల్ఎల్ఎం'ను భారత బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు విస్తరించాలని కోరారు. పాశ్చాత్య ప్లాట్ఫారమ్లకు ఇది ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, దేశంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) నెట్వర్క్ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు, స్బేర్బ్యాంక్ యొక్క అత్యాధునిక వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ను భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఇంటిగ్రేట్ చేయడానికి సాంకేతిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
భారత్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా మున్సిపల్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి స్బేర్బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్ వంటి డిజిటల్ పరిష్కారాలను అందించాలని లోకేష్ సూచించారు. ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్, ఏఐ ఇంజనీర్లను వేగంగా తీర్చిదిద్దేందుకు స్బేర్బ్యాంక్ యొక్క ప్రత్యేక శిక్షణా విధానమైన 'స్కూల్ 21' కోడింగ్ అకాడమీలను భారత్లోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.
ముఖ్యంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలోని ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల సౌలభ్యం కోసం రూపాయి-రూబుల్ వాణిజ్యానికి అనుమతులు ఇవ్వడంతో పాటు, వ్యవస్థీకృత రుణాలు అందించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ సానుకూలంగా స్పందించారు. భారత్లో తమ కార్యకలాపాలను వివరిస్తూ, న్యూఢిల్లీలోని కార్యాలయం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. బెంగళూరులోని తమ ఐటీ హబ్, రూపాయి-రూబుల్ వాణిజ్య లావాదేవీలకు సమన్వయ కేంద్రంగా పనిచేస్తోందని చెప్పారు. న్యూఢిల్లీ, ముంబైలోని తమ శాఖలు వ్యూహాత్మక వాణిజ్య కారిడార్లలో మౌలిక సదుపాయాల పెట్టుబడులకు గేట్వేలుగా ఉన్నాయని వివరించారు. మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని యెఫిమోవ్ హామీ ఇచ్చారు.
మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న స్బేర్బ్యాంక్, రిటైల్ బ్యాంకింగ్తో పాటు క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో విస్తరించిన భారీ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రిటైల్, 35 లక్షల కార్పొరేట్ ఖాతాదారులను కలిగి ఉన్న ఈ బ్యాంకు, 12,000 శాఖలతో ప్రతిరోజూ 8 కోట్ల మంది డిజిటల్ వినియోగదారులకు సేవలందిస్తోంది.