హైదరాబాద్‌లో కోట్ల రూపాయల భూకబ్జాకు యత్నం.. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే: డీసీపీ

Bolla Brahmanaidu absconding in Hyderabad land grab case
  • నకిలీ పత్రాలతో గండిపేటలోని భూమి కబ్జాకు యత్నం
  • ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన డీసీపీ
  • మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ పరారీలో ఉన్నట్లు వెల్లడి
  • తహసీల్దారు ఫిర్యాదుతో విషయం వెలుగు చూసిందన్న డీసీపీ
హైదరాబాద్ ప్రాంతంలో రూ.1,500 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నించిన ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డీసీపీ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. నకిలీ పత్రాలతో బ్రహ్మనాయుడు, మరికొందరు కలిసి గండిపేటలో భూమి కబ్జాకు ప్రయత్నించారని తెలిపారు. గండిపేట తహసీల్దారు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసిందని అన్నారు.

గండిపేట సర్వే నెంబర్ 18లో భూమిని కబ్జా చేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని డీసీపీ వెల్లడించారు. నకిలీ పత్రాలను సృష్టించిన ముగ్గురు వ్యక్తులు నిమ్మల రాజేశ్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సర్వే నెంబర్‌లోని భూమిని క్రమబద్ధీకరించిందని తప్పుడు జీవోలు సృష్టించారని, ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని అన్నారు. దీంతో అప్రమత్తమైన తహసీల్దారు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

చట్టబద్ధమైన హక్కులు లేకుండానే భూమిని విక్రయించాలని కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు డీసీపీ తెలిపారు. ఎకరా భూమిని రూ.3.5 కోట్లకు విక్రయించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి బ్యాంకు పాస్ పుస్తకాలు, మొబైల్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ భూమికి సంబంధించి ఇప్పటికే డబ్బులు చేతులు మారినట్లు గుర్తించామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
Go Back to Shorts
Bolla Brahmanaidu
Hyderabad land scam
Gandi pet land
YSRCP ex MLA
Land grabbing case
Fake documents

More Telugu News