మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Act as Marketing Manager for Fishery Products
  • మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్లా వ్యవహరిస్తానన్న సీఎం చంద్రబాబు
  • వేట నిషేధ సమయంలో 1.30 లక్షల కుటుంబాలకు రూ. 262 కోట్ల ఆర్థిక సాయం
  • మత్స్యకార మహిళల కోసం సీవీడ్ సాగు, 60% సబ్సిడీపై 200 మెకనైజ్డ్ బోట్లు
  • మన జలాల్లో గస్తీ పెంచి ఇతర రాష్ట్రాల బోట్లను అడ్డుకుంటామని హామీ
  • జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, తీర గ్రామాలకు మెటల్ రోడ్ల ప్రకటన
"చేపలు పట్టడమే కాదు, వాటిని అమ్ముకోవడంలోనూ మత్స్యకారులకు అండగా ఉంటాను. మీ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా, ప్రపంచవ్యాప్తంగా గిరాకీ సృష్టించేలా ఒక మార్కెటింగ్ మేనేజర్‌లా నేను వ్యవహరిస్తాను" అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. చేపలు మంచి పౌష్టికాహారమని, ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, ఈ అవకాశాన్ని మన మత్స్యకారులకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం వేటకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతతో, కొత్త ఆదాయ మార్గాలతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం, తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం నిర్వహించిన 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, చేపల వేట నిషేధ కాలానికి గాను 1,30,796 మత్స్యకార కుటుంబాలకు, ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున మొత్తం రూ. 261.50 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. సీఎం ప్రసంగిస్తుండగానే లబ్ధిదారుల ఫోన్లకు డబ్బులు జమ అయినట్లు సందేశాలు రావడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

మత్స్యకారుల హక్కులు, వనరులపై పూర్తి అధికారం

"ఈ తీరం మనది, ఈ బోటు మనదే, ఇక్కడి సంపద కూడా మనదే. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు," అని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా చెప్పారు. మన సముద్ర జలాల్లోకి పొరుగు రాష్ట్రాల బోట్లు వస్తే సహించేది లేదని, తీరప్రాంతంలో గస్తీ పెంచి మత్స్యకారుల హక్కులను కాపాడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుగా ఉన్నాయని, ఆ నీటి వనరుల్లో చేపల పెంపకం చేసుకునే హక్కును మత్స్యకారులకే కట్టబెట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ సీడ్ అందించాలని మత్స్యశాఖను ఆదేశించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల వేటను సులభతరం చేసేందుకు, 60 శాతం సబ్సిడీతో 200 కొత్త మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు సీవీడ్ సాగు

మత్స్యకార పురుషులతో పాటు, మహిళల ఆర్థిక సాధికారతకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. మత్స్యకార, డ్వాక్రా సంఘాల మహిళలకు అదనపు ఆదాయం కల్పించే లక్ష్యంతో 'సీవీడ్' (సముద్రపు నాచు) సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఎంసీఆర్ఐ సహకారంతో మహిళలకు సీవీడ్ సాగులో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దీని ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతామని ఆయన హామీ ఇచ్చారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సీవీడ్, తీరప్రాంత నిఘా కేంద్రం స్టాళ్లను ఆయన సందర్శించి, అధికారుల పనితీరును అభినందించారు.

అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన

తీరప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములను చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రూ. 288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నామని, దీని ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలోని 25 మత్స్యకార గ్రామాలను కలుపుతూ మెటల్ రోడ్లు నిర్మిస్తామని, నార్త్ బకింగ్‌హామ్ కెనాల్ పూడికతీతకు రూ. 6.19 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటుతో స్థానికులకే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తుమ్మలపెంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని, మత్స్య రంగం కూడా తీవ్రంగా దెబ్బతిందని చంద్రబాబు ఆరోపించారు. "గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలు చేస్తోంది. బాబాయ్ హత్య నుంచి కుట్రల వరకు వారిది విధ్వంసమే. ఆ విధ్వంసాన్ని సరిదిద్దడానికి మాకు 23 నెలలు పట్టింది. ఇప్పుడు రాష్ట్రం బుల్లెట్ స్పీడ్‌తో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది" అని అన్నారు. రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తున్నామని, రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలు, తిరుపతి వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్ వస్తున్నాయని వివరించారు.

బీసీల సంక్షేమమే టీడీపీ డీఎన్ఏ

టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు ఉన్నారని, వారికి దశాబ్దాల అనుబంధం ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. బీసీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు. చేనేతలకు, నాయీ బ్రాహ్మణులకు, వడ్డెర్లకు, గీత కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, వారి జీవన ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అచ్చెన్నాయుడు, ఫరూఖ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Fisheries
Marketing Manager
Fishermen Welfare
Tummala Penta
Nellore District
Seaweed Farming
Fishing Harbor
BC Welfare

More Telugu News