విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం... కుక్క నోట మనిషి కాలు!
- రోగి కాలుకు ఇన్ఫెక్షన్ సోకడంతో తొలగింపు
- బయోవేస్ట్లో తరలించేందుకు సంచిలో పెట్టి వ్యర్థాల గదిలో ఉంచిన సిబ్బంది
- తొలగించిన కాలును నోట కరుచుకు వెళ్లిన కుక్క
బయోవేస్ట్ను తరలించే 'సేఫ్' వాహనం, మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు మూడు రోజులకు ఒకసారి వస్తాయి. దీంతో తొలగించిన కాలును వ్యర్థాల గదిలో ఉంచారు. ఈ గదిలో భద్రతా ప్రామాణాలు పాటించకపోవడంతో ఒక కుక్క కాలును నోట కరుచుకు వెళ్ళింది. తలుపులు సరిగా మూసి ఉంచకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించిన ఒక కుక్క నేరుగా మొదటి అంతస్తులోని వ్యర్థాల గదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న సంచిని నోట కరిచి బయటకు పరుగు తీసింది. ఆసుపత్రి వెలుపల కొంతదూరంలో కుక్క ఆ కాలులో కొంత భాగాన్ని పీక్కుని తిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ఆసుపత్రి సిబ్బంది, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఘటన వెలుగులోకి రావడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే కుక్కను వెంబడించి దూరంగా పడేసిన కాలి భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.