పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు

CM Chandrababu review on Petrol and Diesel shortage
  • ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు
  • క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు  సీఎంకు నివేదించిన అధికారులు
  • 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలు
  • ఆదివారం నాటికంటే మెరుగైన సరఫరా
  • రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశం
  • సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశం
రాష్ట్రంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ కొరతపై నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి, విశాఖకు బయలుదేరే ముందు మరోసారి పరిస్థితిపై సమీక్షించారు.

అలాగే విశాఖ నుంచి మరోసారి టెలి కాన్ఫరెన్స్ చేపట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య సాధారణస్థితికి చేరుకునేంత వరకు ఎవ్వరూ విశ్రమించవద్దని, ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు.

సోమవారం మొత్తంగా 2,679 లోడ్లను రాష్ట్రంలోని వివిధ పెట్రోల్ బంకులకు పంపాలని ప్రణాళికలు సిద్దం చేస్తే వాటిల్లో 2,079 లోడ్లు ఇప్పటికే బయలుదేరాయని, వీటిల్లో కొన్ని గమ్యస్థానాలకు చేరుకున్నట్టు అధికారులు వివరించారు. ఇక మిగిలిన మరో 600 లోడ్లను డిస్పాచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ 2,079 లోడ్లల్లో 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ వివిధ బంకులకు వెళ్లాయని అన్నారు.

రాష్ట్రంలోని మూడు ఆయిల్ సరఫరా కంపెనీలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ సంస్థల ద్వారా ఈ మొత్తం లోడ్ డిస్పాచ్ అయిందని, ప్రతి లోడ్‌కు రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అటాచ్ చేసి పంపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. డిస్పాచ్ అయ్యే ప్రాంతం నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకు లోడ్‌లు చేరడం కొంచెం ఆలస్యమవుతోందని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ లోడ్ డిస్పాచ్ రాత్రిపూట కూడా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివారం నాటితో పోల్చుకుంటే సోమవారం ఆయిల్ సరఫరా మెరుగైంది. ఇక సోమవారం ఉదయంతో పోల్చుకుంటే, సాయంత్రానికి అనకాపల్లి, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం, మార్కాపురం వంటి జిల్లాల్లో బంకుల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత మెరుగైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి  6,511 కిలోలీటర్ల పెట్రోల్, 9,046 కిలోలీటర్ల మేర అమ్మకాలు జరిగాయి.
Go Back to Shorts
CM Chandrababu review on Petrol and Diesel shortage
Andhra Pradesh

More Telugu News