శవ రాజకీయం వద్దు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అద్దంకి దయాకర్
- డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దన్న దయాకర్
- బండి సంజయ్ శవ రాజకీయం చేస్తున్నారని మండిపాటు
- శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని ఆయన అన్నారు. శంకర్ గౌడ్ మరణం అత్యంత బాధాకరమని, ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా బాధిత కుటుంబాన్ని కలిసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
మరోవైపు, కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ శవ రాజకీయం చేస్తున్నారని, కార్మికులను రెచ్చగొట్టి నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని దయాకర్ ఆరోపించారు. గతంలో సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికుల పట్ల అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. క్షుద్ర రాజకీయాలు చేసే పార్టీలను నమ్మవద్దని, ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కార్మికులు ఎవరూ తొందరపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.