చంద్రబాబు, పవన్ కల్యాణ్ పులి మీద స్వారీ చేస్తున్నారు: సీపీఐ నారాయణ
- డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ప్రాధాన్యత కోల్పోతాయన్న నారాయణ
- ఈ విషయాన్ని చంద్రబాబు వంటి నేతలు గుర్తించకపోవడం విచారకమని వ్యాఖ్య
- ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను పెంచుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శ
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉందని సీపీఐ సీనియర్ నేత నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సీట్ల సంఖ్య పెరగడం వల్ల ప్రయోజనం ఉండదని, అది అభివృద్ధిని కుంటుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పునర్విభజన వల్ల పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందని, ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి సీనియర్ నేతలు గుర్తించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. దక్షిణాదిలో బీజేపీకి ఆదరణ లేదన్న ఉద్దేశంతో, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను పెంచుకుని పార్లమెంట్లో ఏకపక్షంగా బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపి, దాని వెనుక డీలిమిటేషన్ను తీసుకురావడం బీజేపీ వేస్తున్న పెద్ద ఎత్తుగడ అని నారాయణ విమర్శించారు. మోదీ, అమిత్ షా వంటి నేతలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మద్దతు తెలపడం 'పులి మీద స్వారీ' చేయడమేనని, ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రమాదకరమని హెచ్చరించారు.