విదేశాల్లో ఇంతేనంటూ... బాయ్ ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి నిప్పంటించిన యువతి

Bengaluru woman set boyfriend fire with blindfolds
  • ప్రపోజల్ పేరుతో ప్రియుడిని దారుణంగా హత్య చేసిన యువతి
  • బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ప్రేరణ అనే యువతి అరెస్ట్
  • కుర్చీకి కట్టేసి, నిప్పంటించి ప్రియుడు కిరణ్ ను సజీవదహనం
  • నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతోనే ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడి
  • విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితురాలు
బెంగళూరులో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి ప్రపోజల్ అని నమ్మించి, ప్రియుడిని కుర్చీకి కట్టేసి, నిప్పంటించి సజీవదహనం చేసిందో యువతి. ఈ కిరాతక ఘటనలో కిరణ్ (27) అనే యువకుడు మృతి చెందగా, నిందితురాలైన అతని ప్రేయసి ప్రేరణ (27)ను పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఒక టెలికాం స్టోర్‌లో పనిచేస్తున్న కిరణ్, ప్రేరణ గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవల కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, పెళ్లి చేసుకోడని ప్రేరణ భావించింది. దీంతో అతడిపై తీవ్రమైన కక్ష పెంచుకుంది. మంగళవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్ ను పిలిపించింది.

‘విదేశాల్లో ఇలాగే ప్రపోజ్ చేస్తారు’ అని నమ్మించి, కిరణ్ కళ్లకు గంతలు కట్టి కుర్చీలో బంధించింది. ఆమె మాటలు నమ్మిన కిరణ్, ప్రపోజల్ కోసం ఎదురుచూస్తుండగా, ప్రేరణ అతనిపై మండే ద్రవాన్ని పోసి నిప్పంటించింది. కిరణ్ మంటల్లో కాలిపోతుండగా ఆమె చూస్తూ నిలబడింది. ఈ ఘటనలో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేరణను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. "వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ ఇటీవల అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె భావించింది" అని డీసీపీ డి.ఎల్. నాగేశ్ తెలిపారు. ప్రేరణ తన తల్లి, సోదరుడితో కలిసి అంజనాపురలో నివసిస్తోంది. ఈ పథకం ప్రకారం జరిగిన హత్యపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Bengaluru Woman
Kiran
Prerna
Murder
Blindfolds

More Telugu News