ముఖ్యమంత్రిపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితం: మల్లు రవి
- రేవంత్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన మల్లు రవి
- సీఎంను నోరు మూసుకుని కూర్చో అనడం కిషన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని విమర్శ
- నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపిస్తామని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి 'నోరు మూసుకుని కూర్చో' అనడం కిషన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి పట్ల కేంద్ర మంత్రికి కనీస గౌరవం లేదా? అని ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్లతో పాటు బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న రేవంత్ రెడ్డి సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఇష్టానుసారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని, పార్లమెంట్లో దీనిపై తమ గళం గట్టిగా వినిపిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తన మొండి వైఖరిని కొనసాగిస్తే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని మల్లు రవి హెచ్చరించారు.
దేశం కోసం ఇద్దరు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ప్రాణత్యాగం చేశారని, దేశం పట్ల తమ పార్టీకి ఉన్న నిబద్ధతను ఎవరూ శంకించలేరన్నారు.