రామాలయ నిర్మాణానికి కోటి రూపాయల విరాళాలు: ఆకివీడు ఆలయంపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు
- అన్ని రకాల అనుమతులతో ఆకివీడు రామాలయాన్ని వైభవంగా నిర్మిస్తామన్న రఘురామ
- ఇక్కడ పురాతన రామాలయం ఉందనే విషయం తనకు సాక్షి ద్వారానే తెలిసిందని వెల్లడి
- కల్వరి టెంపుల్ వంటి వారు ప్రార్థనా మందిరాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని ఆరోపణ
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం కోసం భక్తుల నుంచి కోటి రూపాయల విరాళాలు సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణపై ఆయన ఈరోజు స్పందించారు. త్వరలోనే అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో అత్యంత వైభవంగా ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆకివీడులో పురాతన రామాలయం ఉందనే విషయం సాక్షి మీడియా కథనాల ద్వారానే తనకు మొదట తెలిసిందని, అయితే అక్కడకు వెళ్లినప్పుడు తనపై దాడి చేయించారని రఘురామ ఆరోపించారు. అనుమతి లేకుండా ఆలయం నిర్మిస్తున్నారని న్యాయవాది జడా శ్రవణ్ మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారని, దీనిపై నేడు విచారణ జరిగిందని తెలిపారు. ఆలయం, మసీదు లేదా చర్చి.. ఏదైనా సరే జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరని, చట్టబద్ధంగానే రామాలయ నిర్మాణం చేపడతామని కోర్టుకు విన్నవించినట్లు చెప్పారు.
ఆలయ నిర్మాణానికి నిబంధనలు గుర్తు చేస్తున్నారని, కానీ కొందరు నిర్వహిస్తున్న చర్చిలకు మాత్రం ఎటువంటి అనుమతులు లేవని రఘురామ ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో మీటింగ్ హాల్ పేరుతో అనుమతి తీసుకుని చర్చిగా మార్చారని, దీనిపై అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందన లేదని మండిపడ్డారు.
నంబూరు వద్ద ఉన్న కల్వరి టెంపుల్తో సహా పలు ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని, ఇలాంటి అక్రమ నిర్మాణాలపై అధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.