శ్రీవారి ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల దర్శనాలు

Tirumala Records New Heights in Devotee Count and Revenue
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అపూర్వమైన రికార్డులను నమోదు చేసింది. భక్తుల దర్శనాల నుంచి హుండీ ఆదాయం వరకు అన్ని విభాగాల్లోనూ గత రికార్డులను అధిగమించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. టీటీడీ పక్కా ప్రణాళిక, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ఇది సాధ్యమైంది.

దర్శనం, ఆదాయంలో అపూర్వ వృద్ధి
గత రెండేళ్లతో పోలిస్తే 2025-26లో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24, 2024-25 సంవత్సరాల్లో రోజుకు సగటున 70 వేల మంది స్వామివారిని దర్శించుకోగా, 2025-26లో ఈ సంఖ్య రోజుకు సగటున 73 వేలకు చేరింది. తద్వారా దర్శనాల్లో 4.57 శాతం వృద్ధి నమోదైంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రోజువారీ భక్తుల సంఖ్య 90 వేల నుంచి 95 వేల వరకు చేరడం విశేషం. ఈ విజయం వెనుక తిరుమలలో ఏర్పాటు చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషించింది. దీని ద్వారా దర్శనం క్యూలైన్లు, భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎక్కువ మంది భక్తులకు సాఫీగా దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంది.

భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా వృద్ధి చెందింది. గతంలో కేవలం రద్దీ ఎక్కువగా ఉండే నెలల్లో మాత్రమే రూ.120 కోట్లకు పైగా ఆదాయం రాగా, 2025-26లో ఏకంగా ఆరు నెలల పాటు ప్రతినెలా రూ.120 కోట్లకు పైగా హుండీ ఆదాయం సమకూరింది. మొత్తం మీద ఈ ఏడాది హుండీ ఆదాయం రూ.1420 కోట్లు దాటింది. ఇదే సమయంలో వసతి గదుల కేటాయింపులో పారదర్శకత పాటించడం ద్వారా ఆదాయం రూ.133 కోట్ల నుంచి రూ.141 కోట్లకు పెరిగింది.

లడ్డూ విక్రయాలు 13.95 కోట్లకు.. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు 2.85 లక్షలకు 
ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. 2024-25లో 12.49 కోట్ల లడ్డూలు విక్రయించగా, 2025-26లో ఆ సంఖ్య 13.95 కోట్లకు చేరింది. మరోవైపు అన్నప్రసాద సేవలను కూడా టీటీడీ విస్తరించింది. రోజుకు సగటున అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్య 2024-25లో 2.21 లక్షలు ఉండగా, 2025-26లో 2.85 లక్షలకు పెరిగింది. మొత్తంగా మెరుగైన నిర్వహణ, భక్తుల సౌకర్యార్థం తీసుకున్న చర్యలతో తిరుమల క్షేత్రం అన్ని విధాలా సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
Go Back to Shorts
Tirumala
TTD
Tirumala Venkateswara Temple
Lord Venkateswara
Hundi income
Ladoo sales
Pilgrim crowd
AI Integrated Command Control Center
Anna Prasadam
Andhra Pradesh

More Telugu News