రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల

AP Govt Releases Rs 2950 Crore to Retired Employees Under Chandrababu Rule
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి బకాయిలను విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.2,950 కోట్లను విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్‌ బిల్లుల కోసం ఈ నిధులను కేటాయించగా, వాటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైంది. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆర్థిక శాఖ, నిధుల లభ్యత ఆధారంగా ఈ చెల్లింపులను పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం మొత్తం మీద రూ.7,059 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఉద్యోగులే కాకుండా ప్రభుత్వానికి మెటీరియల్ సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్లకు కూడా ప్రాధాన్యమిస్తూ రూ.614 కోట్ల బిల్లులను ఇప్పటికే చెల్లించింది.

పెండింగ్ బకాయిలు విడుదల
తాజా చెల్లింపులకు ముందు కూడా ప్రభుత్వం పలు బకాయిలను క్లియర్ చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బకాయిల కింద రూ.1,848 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే, గ్రూప్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కింద 4,793 మందికి రూ.76 కోట్లు, పోలీసు శాఖకు సంబంధించిన అదనపు సరెండర్‌ లీవుల కోసం రూ.223 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం మీద ప్రభుత్వం ఇంకా గ్రాట్యుటీ బకాయిలు రూ.3,411 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.1,800 కోట్లు చెల్లించాల్సి ఉంది.

పోలీసులకు సరెండర్ లీవ్ బిల్లులు
ప్రస్తుతం సర్వీసులో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం వరుసగా బకాయిలు విడుదల చేస్తుండటంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ దీర్ఘకాల నిరీక్షణకు తెరపడిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Go Back to Shorts
AP Govt
Chandrababu Naidu
AP Government
Retired Employees
Gratuity
Surrender Leave Encashment
Pensioners
Payyavula Keshav
Andhra Pradesh
Government Employees
PF Payments

More Telugu News