Virat Kohli: విరామమే నా బలం.. అందుకే ఫ్రెష్‌గా ఆడుతున్నా: కోహ్లీ

Virat Kohli Says Breaks Keep Him Fresh for Cricket
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఘన విజయంతో ప్రారంభించింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (69*) అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇటీవలే వన్డే క్రికెట్ ఆడటం తన లయను కొనసాగించడానికి బాగా ఉపయోగపడిందని కోహ్లీ వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఛేజింగ్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు. "చాలా కాలం తర్వాత టీ20 క్రికెట్ ఆడాను. ఇటీవల వన్డే సిరీస్‌లో బ్యాటింగ్ చేసిన తీరు అదే మొమెంటం కొనసాగించడానికి సహాయపడింది. నా సహజ శైలికి భిన్నమైన షాట్లు ఆడలేదు. శారీరకంగా ఫిట్‌గా ఉంటే, లయ దానంతట అదే వస్తుందని నాకు తెలుసు" అని మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ కోహ్లీ పేర్కొన్నాడు.

క్రికెట్‌కు తీసుకునే విరామాలు తనను మానసికంగా తాజాగా ఉంచుతాయని కోహ్లీ చెప్పాడు. "గత 15 ఏళ్లుగా ఆడుతున్న తీరుకు అలసిపోయే ప్రమాదం ఉంది. ఈ విరామాల వల్ల నేను మానసికంగా ఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటాను. తిరిగి ఆడేందుకు వచ్చినప్పుడు 120 శాతం సిద్ధంగా ఉంటాను" అని వివరించాడు.

ఈ సందర్భంగా, దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61) ఇన్నింగ్స్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. "అది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్. పడిక్కల్ ఆడుతున్న తీరు చూసి, అతడకి స్ట్రైక్ ఇవ్వడమే సరైందని భావించాను. అతడు మ్యాచ్‌ను పూర్తిగా మా వైపు తిప్పేశాడు. అతడి బ్యాటింగ్ టాలెంట్ ప్రపంచస్థాయిలో ఉంది" అని కొనియాడాడు. పడిక్కల్ దూకుడు వల్లే ఆర్‌సీబీ 202 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
Go Back to Shorts
Virat Kohli
Royal Challengers Bangalore
RCB
IPL 2026
Sunrisers Hyderabad
Devdutt Padikkal
T20 Cricket
Cricket Breaks
Chinnaswamy Stadium
Batting

More Telugu News