Chandrababu Naidu: ఇక అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says No One Can Move Amaravati
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతేనని, దీనిని ఎవరూ తాకలేరని, అంగుళం కూడా కదిలించలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత కల్పించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో, శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిపై గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని, ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యాలను సుదీర్ఘంగా వివరించారు.

చారిత్రక నేపథ్యం.. తెలుగుజాతి ఆత్మగౌరవం
అమరావతికి వందల ఏళ్ల చరిత్ర ఉందని, శాతవాహనులు ఇక్కడి నుంచే పాలన సాగించారని చంద్రబాబు గుర్తు చేశారు. బ్రిటిష్ మ్యూజియంలో సైతం అమరావతి గ్యాలరీ ఉండటమే దీని ప్రాశస్త్యానికి నిదర్శనమని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి అప్పుడే విజయవాడను రాజధాని చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. 

ఒకప్పుడు తెలుగువారిని ‘మదరాసీలు’ అని పిలిచేవారని, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని తెలిపారు. పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకుని తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా రాణించారని, తాను సైబరాబాద్ నిర్మించడం వల్లే నేడు తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

మూడు రాజధానుల కుట్ర.. జగన్‌పై చంద్రబాబు ఫైర్
ఎన్నికలకు ముందు అమరావతికి జై కొట్టిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానుల నాటకానికి తెరలేపారని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ‘ఒక్క ఛాన్స్’ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. 

ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టారని, అమరావతిని శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, వేశ్యల రాజధాని అంటూ దుష్ప్రచారం చేసి ప్రజల్లో విషం నింపారని మండిపడ్డారు. మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పంపితే, నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్‌కు పంపి చట్టం చేయాలని చూశారని, కానీ హైకోర్టు జోక్యంతో రాజధానిని కాపాడుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

రైతుల త్యాగం.. 1631 రోజుల పోరాటం
రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని శాంతియుతంగా ప్రభుత్వానికి ఇచ్చారని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ల్యాండ్ పూలింగ్ జరగలేదని చంద్రబాబు అన్నారు. అలాంటి రైతులపై గత ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, అక్రమ కేసులు బనాయించి, మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చి, కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతులు 1,631 రోజుల పాటు చారిత్రాత్మక పోరాటం చేశారని, ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పాదయాత్రతో తమ ఆవేదనను తెలియజేశారని కొనియాడారు. వైసీపీ అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిందని, అందుకే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.

2028 నాటికి అమరావతి పూర్తి.. పనుల పునఃప్రారంభం
ప్రజాతీర్పుతో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు ప్రారంభమయ్యాయని చంద్రబాబు అన్నారు. అమరావతి పనులు ఇప్పటికే పునఃప్రారంభమయ్యాయని, దాదాపు రూ.56 వేల కోట్ల విలువైన 91 పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 

2028 నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రంక్ రోడ్లు 2027 మే నాటికి, అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్లు 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. శంకుస్థాపన చేసిన నగరంలో పనులు ఆగిపోయి, మళ్లీ పునఃప్రారంభించడం చరిత్రలో అమరావతిలోనే జరిగిందని అన్నారు.

విధ్వంసకారులకు హెచ్చరిక.. మూడు ప్రాంతాల అభివృద్ధికి హామీ
అమరావతి పనులు వేగవంతం అవుతున్న తరుణంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామని, అమరావతిలో ఎవరైనా విధ్వంసానికి పాల్పడాలని చూస్తే అది వారికి చివరి రోజవుతుందని గట్టిగా హెచ్చరించారు. తమ ప్రభుత్వ విధానం ‘ఒకే రాజధాని - అన్ని ప్రాంతాల అభివృద్ధి’ అని పునరుద్ఘాటించారు. 

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజియన్లను మెగా నగరాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో డేటా సెంటర్, అనకాపల్లిలో స్టీల్ సిటీ, రామాయపట్నం పోర్టు వంటి ప్రాజెక్టులతో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
AP Capital
Jagan Mohan Reddy
Three Capitals
Farmers Protest
Telugu Desam Party
Visakhapatnam
Rayalaseema

More Telugu News